సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి
నవతెలంగాణ – కట్టంగూర్
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) ప్రముఖ నేత నర్రా రాఘవరెడ్డి సేవలు చిరస్మరణీయమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. గురువారం ఆయన 11వ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని అమరవీరుల స్మారక భవనంలో ఆయన చిత్రపటానికి పూలమాల చేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసి నీతి, నిజాయితీ, నిబద్ధతతో మచ్చలేని మహానేతగా నిలిచారని, సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అవినీతి మరక అంటకుండా నిత్యం ప్రజల పక్షాన పోరాడిన నాయకుడు రాఘవరెడ్డి అని అన్నారు.
ప్రజా సమస్యలను అసెంబ్లీలో తనదైన శైలిలో ప్రస్తావించి సమస్యల పరిష్కారం కొరకు ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. నాటి ప్రభుత్వాలపై సునిశితమైన విమర్శలు చేసి ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించడంలో ఆదర్శంగా నిలిచారని అన్నారు. నేటి తరం నాయకులు ఆయన స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గంజి మురళీధర్, పార్టీ మండల కార్యదర్శి పెంజర్ల సైదులు, మండల కమిటీ సభ్యులు గడగోజు రవీంద్రాచారి, జాల ఆంజనేయులు, పెంజర్ల కృష్ణ, ముస్కు రవీందర్, బొడ్డుపల్లి నరసింహులు ఉన్నారు.



