నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మండలంలో సేవలు అందిస్తున్న 108, 102 అంబులెన్స్ వాహనాలను జీవీకే ఈఎంఆర్ఐ గ్రీన్ ఇండియా హెల్త్ సర్వీస్ ఆడిట్ అధికారి కిషోర్ తనిఖీ చేశారు. భద్రాచలం డివిజన్ ఎమర్జెన్సీ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ మనోహర్ ఆధ్వర్యంలో అశ్వారావుపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఈ తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా 108 వాహనాల్లో ఉన్న వైద్య పరికరాలు, మందులు, బీపీ మానిటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు వంటి సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు పైలట్లు ఎప్పుడూ వాహనం దగ్గరే సిద్ధంగా ఉండాలని, కాల్ వచ్చిన వెంటనే బయలుదేరి రోగులకు తక్షణ సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఎంటీ దీప్తి, పైలట్ హరీష్ పాల్గొన్నారు.



