అందరికీ సీఎం విజయన్ కృతజ్ఞతలు
నూతన మార్పులకు నాంది పలికే ప్రభుత్వం : ఎంఏ బేబీ
తిరువనంతపురం : కేరళంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. చరిత్రలోనే అత్యంత తక్కువ ప్రచార కాలం ఉన్నప్పటికీ, రాజకీయ వేడి వేసవి తాపాన్ని కూడా మించిపోయింది. ఎన్నికల సంఘం గురువారం రాత్రి విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 78.13శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో 2021లో పోలింగ్ శాతం 74.06శాతం కాగా, 2016లో 77.35శాతంగా నమోదైంది. రాష్ట్ర చరిత్రలో ఇది మూడో అత్యధిక ఓటింగ్ శాతం. సర్ తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న తొలి ఎన్నిక ఇది. 2016లో 2,74,45,311 మంది ఓటర్లు ఉండగా, ఈసారి ఆ సంఖ్య 2,71,42,952కి తగ్గింది. గురువారం ఉదయం 7:00 గంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు 30,495 బూత్లలో పోలింగ్ జరిగింది.
ఉదయం నుంచి బూత్ల వద్ద పొడవైన క్యూలు కనిపించగా, మధ్యాహ్నానికల్లా దాదాపు సగం నియోజకవర్గాల్లో పోలింగ్ 50 శాతం దాటింది. సాయంత్రానికల్లా పోలింగ్ మళ్లీ పెరిగింది. అత్యధిక పోలింగ్ కోజికోడ్లో (80.22 శాతం) నమోదు కాగా, అత్యల్ప పోలింగ్ కొట్టాయంలో (74.35 శాతం) నమోదైంది. ఎన్నికలు చాలా వరకు ప్రశాంతంగా జరిగాయి. తాలిపరంబ నియోజకవర్గంలోని మయిల్ అరింబ్రాలో, సీపీఐ(ఎం) కార్యకర్త ప్రకాశన్పై కాంగ్రెస్ కార్యకర్తలు కత్తితో దాడి చేసి గాయపరిచారు. ఉడుమ నియోజకవర్గంలో, బీఎం రహస్య కెమెరా అమర్చిన కళ్లజోడు ధరించి బూత్లోకి ప్రవేశించిన యూడీఎఫ్ అభ్యర్థి ముఖ్య ఏజెంట్ జమాల్ను పోలీసులు పట్టుకున్నారు. సాయంత్రం దక్షిణ కేరళలో తేలికపాటి వర్షం కురిసినప్పటికీ, అది పోలింగ్పై ప్రభావం చూపలేదు.
ఎన్జీఓ పిటిషన్పై నేడు హైకోర్టు విచారణ
ఓటు వేయలేకపోయిన ఎన్నికల అధికారులకు సంబంధించిన పిటిషన్ను హైకోర్టు శుక్రవారం విచారించనుంది. పిటిషన్ దాఖలు చేసిన ఎన్జీఓ యూనియన్, 21,156 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారని ఎత్తిచూపింది. వారికి ఓటు వేసే అవకాశం కల్పించిన తర్వాత, మొత్తం పోలింగ్ శాతం పెరుగుతుందని భావిస్తున్నారు.
పినరయిలో ఓటు హక్కు వినియోగించుకున్న విజయన్
ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన కుటుంబ సభ్యులతో కలిసి, పినరయిలోని ఆర్సీ అమల బేసిక్ యూపీ పాఠశాలలోని 194వ పోలింగ్ బూత్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గవర్నర్ ఆరిఫ్ అర్లేకర్ తిరువనంతపురంలోని జవహర్ నగర్ పాఠశాలలో ఓటు వేయగా, సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ స్టాట్యూ ప్రాంతంలోని జిల్లా విద్యా కార్యాలయంలో ఓటు వేశారు.
ఎల్డిఎఫ్ విజయం ఒక నూతన ఆరంభానికి నాంది : ఎంఎ బేబీ
ఎల్డిఎఫ్ ఘన విజయం సాధిస్తుందని, గణనీయమైన నూతన మార్పులకు నాంది పలుకుతుందని సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఎ బేబీ మీడియాకు తెలిపారు. మరింత లోతు, విస్తృత పరిధి కలిగిన సంస్కరణలు అమలు చేస్తారని తెలిపారు. ఒక ‘జ్ఞాన ఆర్థిక వ్యవస్థ’ (నాలెడ్జ్ ఎకానమీ) సృష్టించబడుతుందని ఆయన పేర్కొన్నారు. ‘నూతన కేరళం’ నిర్మాణానికి ఈ ఎన్నికల తీర్పు ఎంతో అనుకూలంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో అనుకోకుండా ఏవైనా లోపాలు జరిగి ఉంటే, వాటిని సరిదిద్దుకుంటూ కొత్త ఏల్డీఎఫ్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎంఎ బేబీ తెలిపారు. ప్రస్తుతం ఎల్డీఎఫ్కు అనుకూలంగా ఒక భారీ ప్రజా ఉద్యమం కొనసాగుతోందని ఆయన చెప్పారు.
పినరయి విజయన్ నాయకత్వంలో పదేళ్ల పాలన పూర్తి చేసుకున్న ఎల్డీఎఫ్ ప్రభుత్వం, మరింత పెరిగిన ప్రజా మద్దతుతో తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. ఎల్డీఎఫ్కు మెజారిటీ స్థానాలు దక్కిన తర్వాత, పార్టీ నాయకత్వం చర్చించి, ముఖ్యమంత్రి పదవికి అత్యంత అర్హులైన వ్యక్తిని ఎంపిక చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం స్త్రీ/పురుష అంశాల ఆధారంగా ఉండదని ఆయన వివరించారు. వాయనాడ్ పునరావాస కార్యక్రమానికి సంబంధించి సేకరించిన నిధులను కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగం చేయడం కేరళంకు అవమానకరమని ఆయన అన్నారు. కేరళంలో ప్రస్తుతం యూడీఎఫ్కు వ్యతిరేకంగా బలమైన ప్రజాభావన ప్రబలంగా ఉందని చెప్పారు.
ఓటర్లందరికీ విజయన్ కృతజ్ఞతలు
అసెంబ్లీ ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లందరికీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన హృదయపూర్వక కృతజ్ఞతలను, శుభాకాంక్షలను తెలిపారు. ”నూతన కేరళం కోసం మనమందరం కలిసి ముందుకు సాగుదాం,” అని ముఖ్యమంత్రి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ‘ఈసారి ప్రచారానికి చాలా తక్కువ సమయం మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ, తీవ్రమైన వేసవి ఎండను సైతం లెక్కచేయకుండా అవిశ్రాంతంగా పనిచేసిన రాజకీయ కార్యకర్తల ఉత్సాహం ప్రశంసనీయం. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ పోలింగ్ బూత్లకు చేరుకున్న ప్రజలు, కేరళం యొక్క ఉన్నత ప్రజాస్వామ్య చైతన్యానికి, సొంత నేల పట్ల ఉన్న ప్రగాఢ నిబద్ధతకు నిజమైన నిదర్శనం.
ఈ భారీ ప్రజా భాగస్వామ్యం అత్యంత ప్రశంసనీయం. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ను శాంతియుతంగా పూర్తి చేయడం ఒక ముఖ్యమైన విజయం. ఈ బృహత్తర ప్రక్రియను విజయవంతంగా నిర్వహించడానికి వివిధ స్థాయిలలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా రేయింబవళ్లు పనిచేసిన ఎన్నికల అధికారులు, భద్రత కల్పించిన పోలీసులు, కేంద్ర బలగాలు, ఆరోగ్య కార్యకర్తలు, వాలంటీర్లకు ప్రత్యేక అభినందనలు. ”కేరళ ప్రజాస్వామ్య స్ఫూర్తికి, ప్రజా భాగస్వామ్యానికి మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు,” అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఈ ప్రభుత్వం ఎందుకు మారాలి? : ప్రశ్నించిన ఓటర్లు
ఎల్డీఎఫ్ చారిత్రాత్మకంగా వరుసగా మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని కేరళం తీర్పు స్పష్టం చేస్తోంది. వివిధ సర్వేలు, అంచనాలు, పోలింగ్ కేంద్రాలను సందర్శించిన వారి స్పందనల ద్వారా ఇది స్పష్టమవుతోంది. ‘కష్టకాలం’ దాటి పదేండ్ల ఎదుగుదల, అభివృద్ధి అనుభవం నుంచి ప్రజలు ఒకే ఒక సాధారణ ప్రశ్న అడిగారు: ”ఈ ప్రభుత్వం ఎందుకు మారాలి?” అని.



