Saturday, April 11, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఫూలే ఎజెండా నేటి దేశానికి అవసరం!

ఫూలే ఎజెండా నేటి దేశానికి అవసరం!

- Advertisement -

నేడు ఏప్రిల్‌ 11, మహాత్మా జ్యోతిరావు ఫూలే 199వ జయంతి. ఈ యేడాది పొడుగునా ఆ మహాత్ముడి ద్విశత జయంతి సంబరాలు దేశవ్యాప్తంగా జరగనున్నాయి. భారతదేశపు సాంస్కృతిక పునరుజ్జీవన పతాకగా పేరుగాంచిన ఆ మహనీయుడు జన్మించి రెండు వందల యేళ్లు కావస్తున్నా.. నేటికీ ఆయన జీవితం గురించి, ఆయన చేపట్టిన ఉద్యమాల గురించీ దేశ ప్రజలలో ప్రచారం తక్కువగానే ఉన్నది. వాస్తవానికి గత నలభై, యాభై యేళ్ల నుంచే ఫూలే గురించి దేశవ్యాప్తంగా చెప్పుకోదగ్గ ప్రచారం మొదలైందని చెప్పాలి. అంతకు మునుపు ఆయన ఉనికిని కాలరాసే ప్రయత్నాలు సాగినవి. మూఢాచారాలనీ, మనువాద భావజాలాన్నీ తమ స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుకున్న ఆధిపత్య శక్తులు.. తమకు వ్యతిరేకంగా ప్రజల్లో ప్రచారం చేసిన వారి నోరునొక్కడమో.. వారి చరిత్రను కనుమరుగు చేసే కుట్రలు పన్నడమో చేశాయి. తెలుగునాట.. మూఢాచారాలను, బ్రాహ్మణ భావ జాలాన్నీ తన కవితలతో ప్రశ్నించిన వేమన చరిత్రను.. రెండువందల యేళ్ల పాటు మట్టిలో కప్పివేస్తే.. చార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌ అనే విదేశీ దొర పుణ్యాన.. ఆ సామాజిక విప్లవమూర్తి చరిత్ర, ఆయన కవితా సంపద మళ్లీ మనకు దక్కింది. ఫూలే విషయంలోనూ అదే తరహా అన్యాయం జరిగింది. మహాత్మా ఫూలే లోకమాన్య బాల గంగాధర తిలకులిద్దరూ సమకాలీకులే. ఇద్దరూ మహారాష్ట్రలోని పూణే నగరవాసులే. ఫూలేనేమో.. మనుషులం దరూ సమానులేనని వాదించిన ప్రగతిశీల వాది కాగా.. ‘లోకమాన్యుడు’ మాత్రం అసమానతల చాతుర్వర్ణ వ్యవస్థ బరాబర్‌ కొనసాగాల్సిందేనని పట్టుబట్టిన నికార్సైన ఛాందసవాది. ”స్వరాజ్యం నా జన్మహక్కు” అని గొప్పగా నినదించిన ఆ పెద్దమనిషి.. ఆ స్వరాజ్యంపై హక్కు, సమాజంలోని కొన్ని వర్గాల వారిదేనని సైతం వాదించడం చారిత్రక విషాదం. అలాంటి బాలగంగాధర్‌ తిలక్‌.. మనందరి హైస్కూల్‌ పాఠ్యపుస్తకాలలో కొలువుదీరాడు. సమసమాజం కోసం ఉద్యమించిన ఫూలే ప్రస్తావన.. నేటికీ పాఠ్యాంశాలలో చోటు దక్కించుకోలేదు!

భారతీయ సమాజాన్ని మానవతా విలువల పునాదులపై నిర్మించడానికి గతంలో ఎందరో మహనీయులు కృషి చేశారు. నేడు కొందరు అమాయకంగా భారతదేశంలో సనాతన ధర్మమంటే బ్రాహ్మణ ధర్మమే అని అనుకుంటారు. నిజానికి.. కణాదుడు, అజితకేశ కంబళుడు, చార్వాకులు, లోకాయతులు, జైనులు, బుద్ధుడూ.. ప్రవచించిన సమతాధర్మమే ఈ దేశపు గడ్డపై సనాతన ధర్మం! పాశ్చాత్య నాగరికతలో గ్రీకు దేశానికి చెందిన ప్లేటోని హేతువాద పితామహుడిగా పేర్కొంటారు. ఆ ప్లేటో బతికిన కాలానికి 200 సంవత్సరాలకు ముందే.. క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దిలో.. మనగడ్డపై అజిత కేశ కంబళుడు హేతువాదాన్ని, సమతావాదాన్ని ప్రచారం చేసి.. పురోహిత వర్గం ప్రచారం చేస్తున్న మూఢా చారాలను బహిరంగంగా సవాల్‌ చేశాడు. ఆధునిక యుగంలో ఆ సమతావాద సంస్కృతికి మళ్లీ జీవం పోసి.. ఇంగ్లీషు విద్య వెలుగులో కుల విషవృక్షాన్ని సమూలచ్ఛేదం చేయడానికి మహోన్నత ఉద్యమం నడిపి మహాత్ముడై నిలిచినవాడు జ్యోతిబా ఫూలే.
ఆధిపత్యవర్గాలు తమ దోపిడీ విధానాలకు సామాన్య ప్రజల సమ్మతిని రాబట్టడం కోసమే కృత్రిమంగా చాతుర్వర్ణ వ్యవస్థను సృష్టించారు. అందులో.. దోపిడీ చేసేవారికి పై స్థానాలను అంటగట్టి, సంపద సృష్టికర్తలైన శ్రామిక వర్గాలకు శూద్రులు, అతిశూద్రులు అనే పేర్లను తగిలించారు. ఆధిపత్య వర్గాల దురాగతాలను నిరోధించడానికి, శ్రామికవర్గ ప్రజలలో చైతన్యం తీసుకురా వడానికి.. ఫూలే 1873 సెప్టెంబరు 24న ‘సత్య శోధక్‌ సమాజ్‌’ సంస్ధను స్థాపించాడు. నిమ్నవర్గాల ప్రజలను కులదోపిడీ నుంచి విముక్తి చేయడంతోపాటు రైతులు, కూలీలను హక్కులకోసం సంఘటితపరిచేందుకు ఈ సంస్థ ద్వారా ఫూలే విశేషంగా కృషి చేశాడు. విద్యాజ్ఞానాలను అందుకోవడం ద్వారానే శూద్ర, అతిశూద్రులు తమ హక్కులను నిలబెట్టుకోగలరని గుర్తించి వారిలో విద్యావ్యాప్తి కోసం ప్రత్యేక పాఠశాలలను ఏర్పరచాడు. దళిత వర్గాల స్త్రీలకు సైతం విద్య అందాలనే ఉద్దేశంతో వారి కోసం ప్రత్యేక పాఠశాలల నెలకొల్పాడు. దళిత స్త్రీలకు చదువు చెప్పడానికి అగ్రవర్ణాల స్త్రీలు ముందుకురాని పరిస్థితుల్లో తన భార్య సావిత్రీబాయికి తాను చదువు నేర్పి, ఉపాధ్యాయినిగా తీర్చిదిద్ది ఆమెచేత దళిత స్త్రీలకు చదువు చెప్పించాడు. సత్యశోధక సమాజ్‌ సభ్యుడైన నారాయణ మేఘాజీ లొఖాండే బంబాయిలోని మిల్లు కార్మికుల పోరాటాలకు నాయకత్వం వహించారు. భారత కార్మికులకు ఆదివారం సెలవు దినం, మధ్యాహ్న భోజన విరామం రావడం గనక లొఖాండే కృషి ఎంతో ఉన్నది.

విగ్రహారాధనను, కుల వ్యవస్థను, వేదాల పవిత్రతను ప్రశ్నించాలని ఫూలే ప్రజలకు ఉద్బోధించేవాడు. మూఢా చారాలను ఖండిస్తూ ప్రజల్లో హేతువాద ధోరణులను పెంపొందింపజేయడానికి సత్య శోధక్‌ సమాజ్‌ సభ్యులు పాటుపడ్డారు. భగవంతునికి, భక్తునికి మధ్య అనుసంధాన కర్తగా పురోహితవర్గం ఉండాల్సిన అవసరమే లేదని ఫూలే వాదించేవాడు. పురాణాలు, వేదాలు దైవదత్తమైనవి కావని, మనుషులు రాసినవేనని, నేటికాలానికి అనుగుణంగా వాటిల్లో మార్పులు కూడా చేసుకోవచ్చని వాదించేవాడు. కొందరు స్వార్థపరుల వికృత ఆలోచనల్లోంచే కులవ్యవస్థ ఆవిర్భవించింది తప్ప భగవంతుడు సృష్టించింది కానేకాదని ఆయన తన సభల్లో వివరించేవాడు. పక్షుల్లో, జంతువుల్లో లేని కుల భేదాలు మానవుల్లో ఎందుకున్నాయని అగ్రవర్ణాల పండితులను ఆయన నిలదీసేవాడు.
1873 సంవత్సరంలో.. ఫూలేకు, హేరామ్‌ శాస్త్రి అనే పురోహిత వర్గ ప్రతినిధికీ మధ్యన జరిగిన సంవాదం.. నేటి కాలపు ప్రజలు తప్పక తెలుసుకోవాలి. ఓ ఉదయం పూట ఫూలే ఇంటికి చేరుకున్న హేరాంశాస్త్రి.. ఫూలే రచించిన గులాంగిరి పుస్తక ప్రతిని ఫూలే ముందున్న టేబుల్‌ మీదికి గిరవాటు చేసి గట్టిగా గద్దిస్తాడు: ”ఏమయ్యా ఫూలే..! నీ ‘గులాంగిరి’ పుస్తకంలో మా బ్రాహ్మణుల గురించి చెడు రాతలు ఎందుకు రాసావు? మీ శూద్రులు మా బ్రాహ్మణుల కాళ్లు మొక్కాల్సిందేనని పవిత్ర గ్రంధాలలోనే రాసి ఉన్నది కదా..? భగవంతుడి రాతలు అవి. మేము తప్పుడు రాతలు రాసావంటావెందుకు?” దానికి ఫూలే నింపాదిగా సమాధానమిస్తాడు: ”ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావ్‌ హేరాంశాస్త్రి..!? అవి భగవంతుడు రాసిన రాతలు కాదు. స్వార్థపరులైన మీ బ్రాహ్మణులు.. మీకోసం మీరే రాసుకున్నవి. ప్రపంచంలోని ఏ మత గ్రంథాన్ని ఏ దేవుడూ రాయలేదు. అవన్నీ మానవుల రాతలే! మీ అన్యాయాలను ఇక ఆపండి! నేను బ్రాహ్మణిజానికే వ్యతిరేకం. బ్రాహ్మణులు నా సోదరులే. నా సోదరులు చేసిన తప్పులకు నేను సిగ్గు పడుతున్నాను. సమానత్వం కోసం సాగుతున్న ఉద్యమంలో మీరూ కలసిరండి!” నేటికీ విలువ తగ్గని ఫూలే సిద్ధాంతానికి.. ఆయన పలికిన ఈ మాటలు అద్దం పడతాయి.

ఫూలే ఇంటి పక్కన నివాసముండే ఒక వ్యక్తి ఒకరోజు ఫూలేని అడిగాడు. ”నువ్వు బాగానే ఉద్యమాలు చేస్తున్నావు, సరే. ఈ దేశ నాయకులంతా.. బ్రిటిష్‌ దాస్యానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు. నువ్వెందుకు ఆ పోరాటంలో పాల్గొనడం లేదు?” అని ప్రశ్నించాడు. ఆ మిత్రుడి మాటలకు స్పందించిన ఫూలే సమాధానమిచ్చాడు: ”బ్రిటిష్‌ వాడు మనమీద రుద్దిన గులాంగిరికి వందేళ్ల చరిత్ర మాత్రమే ఉన్నది. నేను ఏ గులాంగిరీకి వ్యతిరేకంగా పోరాడుతున్నానో.. ఆ గులాంగిరీ ఈ దేశ ప్రజలను మూడువేల యేళ్లుగా బాధిస్తున్నది. నా దృష్టిలో ఈ పోరాటం ముఖ్యమైనది” అని తేల్చేస్తాడు. ఆంగ్లేయుల గులాంగిరి నుండి మనం స్వేచ్ఛను పొంది డెబ్భైతొమ్మిదేళ్లు గడిచాయి. కులవ్యవస్థ దాస్యపు సంకెళ్ల నుంచి మాత్రం ఈ జాతికి ఇంకా పూర్తి విముక్తి లభించలేదు. సరికొత్త రూపాల్లో మరింత వికృతంగా ఈ నాలుగు పడగల విషసర్పం ఇంకా బుసలు కొడుతూనే ఉన్నది. మనువాద శక్తులు నేడు మరింత బలాన్ని సంతరించుకుని రాజ్యాంగాన్నే సవాల్‌ చేస్తున్నారు. మెజార్టీ వర్గ ప్రజలకు సమన్యాయాన్ని అందించే సెక్యులర్‌ రాజ్యాంగాన్ని రద్దుచేసి.. గులాంగిరికి ప్రతిరూపమైన మనువాదాన్ని ప్రతిష్టించే మత రాజ్యాన్ని తీసుకొస్తామని చెబుతున్నారు. ఈ దేశపు బిడ్డలందరికీ సమన్యాయాన్ని అందించే ఫూలే ఎజెండా నేడు దేశానికి అత్యంత అవసరం. అమానవీయ మను సంస్కృతిని సమూలంగా నిర్మూలిస్తేనే ఈ దేశానికి పట్టిన పీడ విరగడై మన దేశం ప్రపంచ దేశాల సరసన సగర్వంగా, సమున్నతంగా తలెత్తుకుని నిలబడగలదు. భరతమాతకు నిజమైన స్వాతంత్య్రం ఆ రీతిలోనే సాధ్యం. నేటి కాలానికి జ్యోతిబా ఫూలే జీవన సందేశం, ఆయన బోధనల ఆవశ్యకత గతంకంటే మరింత ఎక్కువగా ఉన్నది!

ఆర్‌.రాజేశమ్‌
9440443183

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -