నవతెలంగాణ – హైదరాబాద్: డిజిటల్ పాలనలో తెలంగాణ ప్రభుత్వం మరో విప్లవాత్మకమైన ముందడుగు వేసింది. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్, స్టాంపుల విభాగానికి సంబంధించిన కీలక సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు వాటిని నేరుగా వాట్సాప్ ద్వారా అందించేందుకు శ్రీకారం చుట్టింది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఆదేశాల మేరకు ఈ సేవలను విస్తరించినట్లు మీసేవ కమిషనర్ టి.రవికిరణ్ ప్రకటించారు.
ఈ నూతన విధానంతో భూమి పత్రాలు, సర్టిఫైడ్ కాపీల వంటి పనుల కోసం ఇకపై రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, తమ మొబైల్ ఫోన్ నుంచే పనులు పూర్తి చేసుకోవచ్చు. గతేడాది నవంబర్ 18న ప్రారంభించిన ‘మీసేవ వాట్సాప్ చాట్బాట్’ సేవలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తున్న నేపథ్యంలో ఈ సేవలను మరింత విస్తరించారు. పౌరులు తమ ఫోన్లో 8096958096 నంబర్ను సేవ్ చేసుకుని, వాట్సాప్లో ‘హాయ్’ అని సందేశం పంపడం ద్వారా ఈ సేవలను పొందవచ్చు.
ఈ చాట్బాట్ ద్వారా రిజిస్ట్రేషన్ పత్రం సర్టిఫైడ్ కాపీ, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ (ఈసీ), స్టాంపుల కొనుగోలు, ఫ్రాంకింగ్, డెఫిసిట్ చెల్లింపులు, సొసైటీలు, ఫర్మ్ల రిజిస్ట్రేషన్, అపరాధ రుసుము చెల్లింపు, సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తులు వంటి అనేక సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ సేవలను వినియోగించుకోవడం చాలా సులభం. వాట్సాప్లో కావాల్సిన సేవను ఎంచుకుని, అవసరమైన వివరాలను ఫామ్లో నింపిన తర్వాత, ఆన్లైన్ ద్వారానే రుసుము చెల్లించవచ్చు. సర్టిఫైడ్ కాపీల కోసం దరఖాస్తు చేస్తే, అధికారులు ఆమోదించిన వెంటనే ఆ పత్రాలు నేరుగా వాట్సాప్కే పంపబడతాయి.



