Monday, April 13, 2026
E-PAPER
Homeజాతీయంఅల్విదా ఆశా

అల్విదా ఆశా

- Advertisement -

92 ఏండ్ల వయసులో చికిత్సపొందుతూ కన్నుమూత
ప్రధాని, రాష్ట్రపతి సహా పలువురి సంతాపం

ముంబయి : భారతీయ సంగీత చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన గాత్రాల్లో ఒకటైన ప్రముఖ నేపథ్య గాయని ఆశా భోస్లే ముంబయిలోని బ్రీచ్‌ క్యాండీ ఆస్పత్రిలో కన్నుమూశారు. గుండెపోటు, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆమెను శనివారం ఆస్పత్రిలో చేర్చారు. ఆమె వయస్సు 92 ఏండ్లు. దిగ్గజ గాయని లతా మంగేష్కర్‌ చెల్లెలైన ఆశా భోస్లే ఎనిమిది దశాబ్దాలకు పైగా విస్తరించిన సంగీత వారసత్వాన్ని వదిలి వెళ్లారు. మహారాష్ట్రలోని సాంగ్లీలో 1933, సెప్టెంబర్‌ 8న జన్మించిన ఆమె, ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు పండిట్‌ దీనానాథ్‌ మంగేష్కర్‌ కుమార్తె. ఆమె తండ్రి మరణించినప్పుడు, ఆమెకు కేవలం తొమ్మిదేండ్లు. కుటుంబాన్ని పోషించడానికి ఆమె తన సోదరితో పాటు సినిమాల్లో పాడటం, నటించడం ప్రారంభించారు. ఆమె 1943లో మరాఠీ చిత్రం ‘మాఝా బాల్‌’తో సినీ రంగ ప్రవేశం చేసి, 1948లో ‘చునరియా’ చిత్రంతో హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఎనిమిది దశాబ్దాలకు పైగా సాగిన తన కెరీర్‌లో, ఆమె పలు భాషల్లో 12,500 కు పైగా పాటలను రికార్డ్‌ చేశారు.

వాటిలో ‘అభీ నా జావో చోడ్‌ కర్‌’, ‘ఇన్‌ ఆంఖోం కీ మస్తీ’, ‘పియా తు అబ్‌ తో ఆజా’ వంటి కాలాతీతమైన గీతాలు ఈనాటికీ అభిమానుల ఆదరణ పొందుతున్నాయి. ఆమె శాస్త్రీయ సంగీతం, గజల్‌, భజన్‌, పాప్‌, ఖవ్వాలీల్లో ప్రావీణ్యం ప్రదర్శించారు. హిందీతో పాటు 20కి పైగా భాషలకు తన గాత్రాన్ని అందించారు. సంగీత దర్శకులు ఓ.పి. నయ్యర్‌, సచిన్‌ దేవ్‌ బర్మన్‌, ఆర్‌డీ బర్మన్‌లతో ఆమె గాత్రం చేసిన కృషి భారతీయ చిత్రసీమలో చిరస్థాయిగా నిలిచిపోయిన కొన్ని పాటలను అందించింది. 2011లో ప్రపంచంలోనే అత్యధిక పాటలను రికార్డ్‌ చేసిన కళాకారిణిగా ఆమె గుర్తింపు పొందారు. 79 ఏండ్ల వయసులో.. 2013లో వచ్చిన ‘మై’ చిత్రంలో కథానాయికగా ఆమె తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. ఆమె అందుకున్న గౌరవాల్లో 1981లో ‘ఉమ్రావ్‌ జాన్‌’, 1987లో ‘ఇజాజత్‌’ చిత్రాలకు ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా రెండు జాతీయ పురస్కారాలు, 2000లో దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు, 2008లో పద్మవిభూషణ్‌, జీవిత సాఫల్య పురస్కారంతో సహా తొమ్మిది ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు, రెండు గ్రామీ నామినేషన్‌లు ఉన్నాయి.

ఆశా భోస్లే మరణం పట్ల సీఎం దిగ్భ్రాంతి
పద్మ విభూషణ్‌, జాతీయ పురస్కార గ్రహీత, గాయని ఆశాభోస్లే మరణం పట్ల సీఎం రేవంత్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారతీయ సంగీతానికి చేసిన అనితరసాధ్యమైన సేవలు, భాషా భేదం లేకుండా తన గానంతో ఆమె ప్రజలను అలరించిన తీరు, తరతరాలకు ప్రేరణనిచ్చే వారసత్వాన్ని అందించారని పేర్కొన్నారు. ఆమె మరణంతో దేశ సాంస్కృతిక, కళారంగానికి తీరని లోటు ఏర్పడిందని చెప్పారు. ఆశా భోస్లే కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రపంచానికి ముఖ్యమంత్రి సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోశారు. ఆశాభోస్లే మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం భారతీయ సాంస్కృతిక రంగానికి తీరని లోటు అని విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రియులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆశాభోస్లే మరణం పట్ల బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంతాపం తెలిపారు. భారతీయ సంగీత ప్రపంచం ఒక అపురూపమైన స్వరాన్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మరణం భారతీయ కళా జగత్తుకు తీరని లోటు అని పేర్కొన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -