– రాజ్యాంగ హామీలపై అవగాహన
– సమస్యలకు తక్షణ పరిష్కారం
నవతెలంగాణ – కామారెడ్డి
గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల హక్కులను పరిరక్షిస్తూ, వారికి రాజ్యాంగం కల్పించిన రక్షణలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖలు సంయుక్తంగా “పౌర హక్కుల దినోత్సవం” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా సామాజిక న్యాయం, సమానత్వం వంటి రాజ్యాంగ విలువలు గ్రామస్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక రక్షణలు కల్పించబడ్డాయి.
సమానత్వ హక్కు (ఆర్టికల్ 14), వివక్ష నిషేధం (ఆర్టికల్ 15), ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు (ఆర్టికల్ 16) వంటి హక్కులతో పాటు, అణగారిన వర్గాల అభివృద్ధికి ప్రత్యేక నిబంధనలు అమలులో ఉన్నాయి. ముఖ్యంగా ఆర్టికల్ 17 ద్వారా అప్రజాస్వామికమైన అంటరానితనాన్ని రద్దు చేస్తూ, సమాన హక్కులను హామీ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీలపై జరిగే అణచివేతలను అరికట్టేందుకు ఎస్సీ, ఎస్టీ (అత్యాచార నివారణ) చట్టం, 1989 అమలులో ఉంది. ఈ చట్టం కింద దాడులు, అవమానాలు, భూకబ్జాలు వంటి చర్యలకు కఠిన శిక్షలు విధించబడతాయి. పౌర హక్కుల దినోత్సవంలో ఈ చట్టంపై పోలీస్ అధికారులు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తూ, బాధితులు భయపడకుండా ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.
ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, భూ హక్కులు, పింఛన్లు, రేషన్, కుల ధృవపత్రాలు, భద్రతా అంశాలపై ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. రెవెన్యూ అధికారులు భూమి సమస్యలు, పత్రాల పరిష్కారంపై దృష్టి సారిస్తుండగా, పోలీస్ అధికారులు మహిళల భద్రత, చట్ట పరిరక్షణ, అత్యాచార నివారణ చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలకు తమ హక్కులపై స్పష్టమైన అవగాహన ఏర్పడటంతో పాటు, సమస్యలకు స్థానిక స్థాయిలోనే పరిష్కారం లభిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అణగారిన వర్గాలకు ఇది ఒక వేదికగా మారుతోంది, పౌర హక్కుల దినోత్సవం ఎస్సీ, ఎస్టీల హక్కులను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తూ, రాజ్యాంగం లక్ష్యమైన సామాజిక న్యాయాన్ని గ్రామ స్థాయిలో అమలు చేసే దిశగా ముందుకు సాగుతోంది.



