నవతెలంగాణ-హైదరాబాద్: మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో కల్తీ మద్యం కేసులో మృతుల సంఖ్య 12కి చేరింది. సుమారు 30మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. వారిలో ఒకరిని మెరుగైన వైద్య చికిత్స కోసం విమానంలో భోపాల్కు తరలించినట్లు తెలిపారు. బాధితుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుల ఆధారంగా మూడు వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు సాగర్ రేంజ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిఐజి) శశీంద్ర చౌహాన్ తెలిపారు. ఎఫ్ఐఆర్లలో నిందితులుగా పేర్కొన్న 30 మందిలో 14 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని అన్నారు. సోమవారం తెల్లవారుజామున మరో వ్యక్తి మరణించడంతో మృతుల సంఖ్య 12కు చేరిందని సాగర్ కలెక్టర్ ప్రతిభా పాల్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు ఎక్సైజ్ అధికారులను, ఇద్దరు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు సాగర్ కలెక్టర్ ప్రతిభా పాల్ తెలిపారు.
మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లా కేంద్రానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న బండా తహసీల్లోని రెండు గ్రామాల్లో, కల్తీ మద్యం సేవించడం వల్ల ఆదివారం 11 మంది మరణించగా, మరో 54 మంది అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.



