నవతెలంగాణ-హైదరాబాద్ : శతాబ్దాలుగా ఆయుర్వేదంలో ‘మూలికల రాజు’గా పేరొందిన అశ్వగంధ వాడకంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార ఉత్పత్తులు, హెల్త్ సప్లిమెంట్స్లో అశ్వగంధ ఆకులను వాడటంపై పూర్తిస్థాయిలో నిషేధం విధించింది. ఆరోగ్య భద్రతా కారణాల దృష్ట్యా కేవలం అశ్వగంధ వేర్లు, వాటి నుంచి తీసిన రసాన్ని మాత్రమే వాడాలని స్పష్టం చేసింది.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఈ మేరకు ఏప్రిల్ 16న అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది. అశ్వగంధ ఆకులు కలిపిన ఉత్పత్తులను తయారుచేయడం, విక్రయించడం లేదా దిగుమతి చేసుకోవడం చట్టవిరుద్ధమని పేర్కొంది. మార్కెట్లో ఇప్పటికే ఉన్న అటువంటి ఉత్పత్తులను వెంటనే వెనక్కి తీసుకోవాలని తయారీదారులను ఆదేశించింది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006 ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఎందుకు ఈ నిషేధం?
అశ్వగంధ ఆకుల్లో ‘విథాపెరిన్-A’ అనే రసాయనం అధిక మోతాదులో ఉండటమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణం. ఇది పరిమితికి మించి శరీరంలోకి వెళ్తే కాలేయానికి హాని కలిగించవచ్చని పలు అధ్యయనాల్లో తేలింది. ఇటీవల ఐస్లాండ్, జర్మనీ, భారత్లో నిర్వహించిన పరిశోధనల్లో అశ్వగంధ సప్లిమెంట్లు వాడిన కొందరిలో కాలేయం దెబ్బతిన్న కేసులు నమోదయ్యాయి.



