– నిర్ణయం తక్షణమే అమల్లోకి
– కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి
– బెంగళూరు తొక్కిసలాట ఘటనలో తాజా చర్యలు
బెంగళూరు: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్నాటక ప్రభుత్వం ఇప్పటికే చర్యలకు ఉపక్రమించింది. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పొలిటికల్ సెక్రెటరీ కె.గోవిందరాజ్పై వేటు వేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. బెంగళూరు తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి చెందటం తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం విదితమే. ఈ దుర్ఘటనపై నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న సిద్ధరామయ్య ప్రభుత్వం.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాధ్యులపై చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే బెంగళూరు నగర పోలీసు కమిషనర్ బి. దయానంద్తో పాటు మరో నలుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
తొక్కిసలాటకు ముందు బుధవారం ఉదయం ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన కీలక సమావేశంలో పోలీసు కమిషనర్పై గోవిందరాజ్ ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. విక్టరీ పరేడ్, విధాన సౌధ, చిన్నస్వామి స్టేడియంలో వేడుకలకు అనుమతివ్వలేమని పోలీస్ కమిషనర్ చెప్పినప్పటికీ ఆయన వినిపించుకోలేదని సమాచారం. ఆయన ఒత్తిడితోనే విధాన సౌధ, చిన్నస్వామి స్టేడియంలో విక్టరీ సెలబ్రేషన్స్కు అనుమతి వచ్చినట్టు తెలిసింది. ఈ కారణంగానే ఆయనపై అధికారులు వేటు వేసినట్టుగా జాతీయ మీడియా చెప్తున్నది. మరోవైపు, కర్నాటక ఇంటెలిజెన్స్ చీఫ్ హేమంత్ నింబాల్కర్పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది.
వద్దన్న పోలీసులు.. పట్టించుకోని ప్రభుత్వం
తొక్కిసలాటపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని పలువురు ఎత్తి చూపుతున్నారు. కప్ గెలిచిన మరుసటి రోజే ఈవెంట్ నిర్వహణ వద్దనీ, భద్రత, లాజిస్టిక్ సమస్యలు తలెత్తుతాయని బెంగళూరు పోలీసులు ప్రభుత్వానికి ముందే సూచించారు. ఆదివారం వేడుకను నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, పోలీసుల విజ్ఞప్తిని పక్కనబెట్టిన ప్రభుత్వం.. ఈవెంట్ నిర్వహణకే మొగ్గుచూపింది. తక్కువ సమయం ఉండటంతో తగిన ఏర్పాట్లు చేయలేక, వచ్చిన రద్దీని అదుపు చేయలేక పోలీసులు చేతులెత్తేశారనీ, ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగిందని తెలిసింది. మరోవైపు, ఫైనల్ జరగడానికి ముందే ఈవెంట్ నిర్వహణ కోసం కర్నాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ) ప్రభుత్వాన్ని అనుమతి కోరినట్టు ఓ లేఖ తాజాగా బయటకు వచ్చింది. చివరి నిమిషంలో స్టేడియంలో వేడుకకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇది కూడా ప్రమాదానికి కారణమైనట్టు తెలిసింది.
హైకోర్టును ఆశ్రయించిన కర్నాటక క్రికెట్ సంఘం
బెంగళూరులో తొక్కిసలాట ఘటనలో తమపై దాఖలైన కేసును సవాలు చేస్తూ కర్నాటక క్రికెట్ అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించింది. కేఎస్సీఏ అధ్యక్షుడు రఘురామ్ భట్, కార్యదర్శి ఎ.శంకర్, కోశాధికారి ఈఎస్ జయరాం సంయుక్తంగా కర్నాటక హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తమపై నమోదైన కేసును కొట్టేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై అత్యవసర విచారణ జరపాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. వీరి పిటిషన్పై ఇవాళ మధ్యాహ్నం విచారణ జరగనున్నట్టు తెలుస్తోంది.
సీఎం సిద్ధరామయ్య పొలిటికల్ సెక్రెటరీపై వేటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES