– బీఆర్ఎస్లోని దయ్యాల సంగతి తేల్చండి
– అప్పటి ప్రధాని పీవీకే కమిషన్ ఎదుట హాజరు తప్పలేదు
– కేసీఆర్ స్థాయి ఎంత?
– టీటీడీ తరహాలో వైటీడీ ఏర్పాటు
– తిరుమలాపూర్ గంధమల్ల రిజర్వాయర్తో పాటు పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలో సీఎం రేవంత్రెడ్డి
నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు మూసీ నది కాలుష్యంతో ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించేందుకు మూసీ ప్రక్షాళన చేస్తానంటే బీజేపీ, బీఆర్ఎస్కు ఎందుకింత అక్కసు.. ఎవరు అడ్డు వచ్చినా ప్రక్షాళన చేసి తీరుతాం.. ఈ ప్రాంత ప్రజల కష్టాలు తీర్చుతాం” అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం, తుర్కపల్లి మండలం తిరుమలగిరి గ్రామంలో గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణంతోపాటు సుమారు రూ.1051.45 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ.. నవంబర్ 11న తన జన్మదినం సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి పాదాల చెంత మూసీ వెంట పాదయాత్ర చేసి సమస్యలు తెలుసుకున్నానని చెప్పారు. ప్రక్షాళన చేస్తామని మాట ఇచ్చి పనులు మొదలు పెట్టామని, కానీ మోకాళ్ల కట్టె పెట్టి అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో యమునా నది, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి గంగానది ప్రక్షాళన చేస్తే తప్పు లేదుగానీ తెలంగాణలో మూసీ నది కాలుష్యం నుంచి ప్రజలను కాపాడుకుంటామంటే తప్పేంటని ప్రశ్నించారు. ఆరు నూరైనా మూసీ నదిని ప్రక్షాళన చేసి గోదావరి నదీ జలాలతో నింపుతామని తెలిపారు. పదేండ్లలో గత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులపై రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేస్తే.. ఎస్ఎల్బీసీకి, డిండికి నిధులు ఎందుకు ఇవ్వలేదని? ఎందుకు పూర్తి చేయలేదని ? ప్రశ్నించారు. బీఆర్ఎస్లో కేసీఆర్ చుట్టూ దయ్యాలు చేరాయని స్వయంగా ఆయన కుమార్తె కవిత ప్రకటించారని, అందువల్ల బీఆర్ఎస్లో ఉన్న దయ్యాలు ఎవరో తేల్చాలని అన్నారు. ఇకపై భారత రాష్ట్ర సమితి కాదని, దయ్యాల రాష్ట్ర సమితి(డీఆర్ఎస్) అని పేరు ప్రకటించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను దెయ్యాలుగా అభివర్ణించాలని సూచించారు.
పీవీకే కమిషన్ ఎదుట హాజరు తప్పలే ..
”కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై కేసీఆర్కు నోటీసులు జారీ చేస్తే.. కాళేశ్వరం కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అని అంటారా? దేశానికి ప్రధానిగా చేసిన పీవీ నరసింహారావుకే ఒక సందర్భంలో కమిషన్ ఎదుట హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. ప్రధాని స్థాయి నాయకుడే కమిషన్ ఎదుట హాజరయ్యారు. కేసీఆర్ నువ్వు ఎంత.. నీ స్థాయి ఎంత అని” సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ప్రజలు సహకరిస్తే తెలంగాణను 10 ఏండ్లలో వన్ ట్రిలియన్ ఎకానమీ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. తెలంగాణ ప్రజలు దేశ పునర్నిర్మాణంలో భాగస్వాములయ్యేలా నిలబెడతామని, జపాన్, సింగపూర్ సరసన రాష్ట్రాన్ని నిలుపుతామని అన్నారు. దేశంలో వందేండ్లలో ఎవరూ చేయని విధంగా మొదటిసారి కులగణన చేపట్టి రాష్ట్రంలో 56.36శాతం బలహీన వర్గాలు ఉన్నారని లెక్కలు తీశామన్నారు. విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామన్నారు.
ఆలేరు నియోజకవర్గాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ గంధమల్ల రిజర్వాయర్ను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అన్ని సామాజిక తరగతుల పిల్లలు ఒకే చోట చదువుకునే విధంగా 100 నియోజకవర్గాల్లో రూ.20వేల కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తున్నామని చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్కు వైటీడీ (యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్)బోర్టు ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. తిరుపతిలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మాదిరిగానే ఇక్కడ చేపట్టే ప్రభుత్వ వైద్య కళాశాలను యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్తామని, దేశంలోనే గొప్ప యూనివర్సిటీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని క్యాబినెట్లో చర్చించి.. ఒక కొలిక్కి తెచ్చామన్నారు. గత పదేండ్లలో ఏనాడైనా మొదటి తేదీన జీతాలు పడ్డాయా.. ఆనాడు జీతాలు చెల్లించలేనివారు ఈ రోజు మాట్లాడుతున్నారని విమర్శించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఆలేరు శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఏఎంఆర్పి కింద మిగిలిపోయిన 10 కిలోమీటర్ల ఉప కాలువ పనులకు నిధులు ఇచ్చి పూర్తి చేయాలని సీఎంను కోరారు. తుర్కపల్లి మండలానికి ఇండిస్టియల్ పార్కు మంజూ రు చేయాలని, గుండాల కాల్వ పనులకు నిధులు మంజూరు చేయాలని, బొమ్మల రామారంలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలు తీర్చాలని, మదర్ డెయి రీని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సంద ర్భంగా ముగ్గురు ఇందిరమ్మ ఇండ్ల లబ్ది దారులకు ముఖ్యమంత్రి పట్టాలు పంపిణీ చేశారు. స్వయం సహాయక మహిళా సంఘాలకు రూ.54 కోట్ల 70లక్షల బ్యాంక్ లింకేజీ చెక్కులను అందజేశారు.
శంకుస్థాపనలు
రూ.574.56 కోట్లతో నిర్మించనున్న గంధమల్ల రిజర్వాయర్ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. రూ.200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి, యాదాద్రి భువనగిరి జిల్లాలో రూ.183 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, స్ట్రాం వాటర్ డ్రయినేజీ పనులకు, రూ.7.50 కోట్లతో కొలనుపాకలో హెచ్ఎల్బి నిర్మాణ పనులకు, 6 కోట్లతో కల్వలలో హెచ్ఎల్బి నిర్మాణానికి, మోటకొండూరు తహసీల్దార్, ఎంపీడీవో, పోలీస్టేషన్ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. యాదగిరిగుట్ట మండలం దాతర్పల్లి గ్రామంలో 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాం పనులకు, ఆలేరు నియోజకవర్గంలో బీటీ రోడ్ల పనులకు, ఆలేరు మార్కెట్ యార్డులో 2500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దనసరి సీతక్క, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్రెడ్డి, వేముల వీరేశం, మందుల సామెల్, ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, తీన్మార్ మల్లన్న, శ్రీపాల్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, డెయిరీ కార్పొరేషన్ చైర్మెన్ గుత్తా అమిత్ రెడ్డి, పర్యాటక శాఖ చైర్మెన్ పటేల్ రమేష్రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, డీసీపీ ఆకాన్ష్ యాదవ్ పాల్గొన్నారు.
మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES