నవతెలంగాణ-హైదరాబాద్ : కొలంబియాలో నిన్న భారీ భూకంపం సంభవించి పెను విషాదాన్ని మిగిల్చింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో సంభవించిన ఈ శక్తిమంతమైన భూకంపం ధాటికి ఇప్పటివరకు 132 మంది మరణించగా, వందల మంది గాయపడ్డారు. ఈ శతాబ్దంలో దేశంలో ఇదే అత్యంత తీవ్రమైన భూకంపమని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.
చోకో డిపార్ట్మెంట్లోని శాన్ జోస్ డెల్ పల్మార్ సమీపంలో సుమారు 100 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూప్రకంపనల ధాటికి పెరీరా, కాలీ, మణిజాలెస్ వంటి నగరాల్లో భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. మణిజాలెస్లోని ఓ చర్చి టవర్ కూలిపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రకంపనలు రాగానే ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఈ విపత్తు నేపథ్యంలో దేశాధ్యక్షుడు అబెర్లార్డో డి లా ఎస్ప్రియెల్లా దేశవ్యాప్తంగా నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించారు. భూకంపం వల్ల 1,500కు పైగా ఇళ్లు దెబ్బతినగా, 61 భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయని అధికారులు వెల్లడించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో ఆరు నెలల చిన్నారిని సురక్షితంగా కాపాడారు. పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’ ప్రాంతంలో కొలంబియా ఉండటమే భూకంప తీవ్రతకు కారణమని నిపుణులు చెబుతున్నారు.



