– సీఎం సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో స్వచ్ఛంద సంస్థల ఒప్పందాలు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతికతో కూడిన ఆధునిక విద్యాబోధనను అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. దానిలో భాగంగా ఆదివారం సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో విద్యారంగంలో స్వచ్ఛందంగా విశేష సేవలు అందిస్తున్న సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక బోధన సేవలను ఉచితంగా అందించాలన్న లక్ష్యంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఆరు ప్రముఖ సంస్థలతో విద్యాశాఖ ఈ ఒప్పందాలు చేసుకుంటుందని తెలిపారు. నందన్ నీలేకని నేతృత్వంలోని ఎక్స్టెప్ ఫౌండేషన్, డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్, అలక్పాండే అధ్వర్యంలోని ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ, షోయబ్దార్ నిర్వహిస్తున్న పైజామ్ పౌండేషన్, సఫీనా హుస్సేన్ అధ్వర్యంలోని ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థలు ప్రభుత్వంతో ఈ ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ సంస్థల భాగస్వామ్యంతో రాష్ట్ర విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చని ప్రభుత్వం భావిస్తుంది.
– నందన్ నీలేకని నేతృత్వంలోని ఏక్స్టెప్ ఫౌండేషన్ కృత్రిమ మేథ ఆధారిత ప్లాట్ఫారమ్తో 540 పాఠశాలల్లో పని చేస్తుంది. దశలవారీగా 33 జిల్లాల పరిధిలో 5 వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలకు విస్తరిస్తుంది. మూడో తరగతి నుంచి 5వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లిష్ భాషలతో పాటు, మ్యాథ్స్ బేసిక్స్ను ఈ సంస్థ అందిస్తుంది.
– ఫిజిక్స్ వాలా ఇంటర్ విద్యార్థులకు నీట్, జేఈఈ, క్లాట్ పరీక్షలకు విదార్థుల్ని సన్నద్ధుల్ని చేస్తుంది. పాఠశాల స్థాయి నుంచే పోటీ పరీక్షల దృక్కోణంలో విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తారు.
– ఖాన్ అకాడమీ రాష్ట్రంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలకు అనుగుణంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో వీడియో ఆధారిత స్టీమ్ ద్వారా శిక్షణ అందిస్తుంది.
– డాక్టర్ సునీతా కృష్ణన్ నేతృత్వంలోని ప్రజ్వల ఫౌండేషన్ 6వ తరగతి నుంచి క్లాస్ 12 (ఇంటర్) వరకు విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా బాల సురక్ష, రక్షణ కార్యక్రమాలను ప్రారంభిస్తుంది.
– పై జామ్ ఫౌండేషన్ ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు కోడింగ్, కంప్యూటేషనల్ థింకింగ్పై శిక్షణ ఇస్తుంది.
– ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ రాష్ట్రంలో పాఠశాలలకు దూరంగా ఉన్న 16 వేలకు పైగా పిల్లలను తిరిగి బడిలో చేర్పించటంతో పాటు, బాలికల అక్షరాస్యత, విద్యావకాశాలను మెరుగుపరుస్తుంది.
ఈ ఒప్పంద కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్రెడ్డి, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నవీన్ నికోలస్, విద్యాశాఖ స్పెషల్ సెక్రటరీ హరిత, ఏక్స్టెప్ ఫౌండేషన్ సీఈవో జగదీశ్బాబు, ప్రజ్వల ఫౌండేషన్ చీఫ్ డాక్టర్ సునీతా కృష్ణన్, ఫిజిక్స్ వాలా కో-ఫౌండర్ ప్రతీక్ మహేశ్వరి, ఖాన్ అకాడమీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ స్వాతి వాసుదేవన్, పైజామ్ పౌండేషన్ ఫౌండర్ షోయబ్దార్, ఎడ్యుకేట్ గర్ల్స్ సీఇఓ గాయత్రి నాయిర్ లోబో తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా ఆధునిక విద్యాబోధన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES