– నాలుగు ఎకరాలున్న రైతుల ఖాతాల్లో జమ
– కొనసాగుతున్న రైతు భరోసా : మంత్రి తుమ్మల వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం వానాకాలానికి ఇస్తున్న రైతు భరోసా పథకం కొనసాగుతున్నది. మూడో రోజు నాలుగు ఎకరాలున్న రైతులకు రూ.1,313.53 కోట్లు విడుదల చేసింది. ఈమేరకు బుధవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటన విడుదల చేశారు. రైతుభరోసా పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాల్లోకి పెట్టుబడి సాయం జమ చేసినట్టు తెలిపారు. దీంతో 21.89 లక్షల ఎకరాలున్న 6.33 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరుతున్నదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు మొత్తం రైతు భరోసా నిధులు రూ.5215.26 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. తద్వారా 58.04 లక్షల మంది రైతులకు సాయం అందించామని పేర్కొన్నారు. రూ.9 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామంటూ సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన హామీమేరకు వరుసగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నట్టు తెలిపారు. ఎకరాలతో సంబంధం లేకుండా సాగు యోగ్యమైన అన్ని భూములకూ ఈ సహాయం అందిస్తామని స్పష్టం చేశారు. రైతుభరోసా విషయంలో బీఆర్ఎస్ నాయకులకు తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదని హెచ్చరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా తొమ్మిది రోజుల్లో రైతుభరోసా సహాయం పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు ఆత్మ విమర్శ చేసుకుని ప్రభుత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. లేదంటే రైతాంగం ఎప్పటికీ బీఆర్ఎస్ నేతలను క్షమించబోదని హెచ్చరించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక సందర్భంలో మినహా వానాకాలం రైతుబంధు సహాయం ఎప్పుడూ సాగు కాలానికి ముందుగా ఇవ్వలేకపోయిందని గుర్తు చేశారు. ప్రతిసారి ఆలస్యంగా రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లోకి జమ చేసిందని తెలిపారు. రైతుభరోసా పథకం కింద ఎకరాకు రూ.5 వేల నుంచి రూ.6వేలకు పెట్టుబడి సహాయం పెంచి రైతులకు అందజేస్తున్నట్టు పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఇవ్వాల్సిన యాసంగి సీజన్కు సంబంధించిన రైతుబంధు నిధులు ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం వదిలేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ నిధులను కూడా చెల్లించిందని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే దాదాపు రూ.77,000 కోట్లు రైతు సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణయేనని మంత్రి స్పష్టం చేశారు.
మూడో రోజు రూ.1,313 కోట్లు విడుదల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES