నవతెలంగాణ-హైదరాబాద్ : ఇంగ్లాండ్, భారత్ల మధ్య లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో మొదటి టెస్ట్ మ్యాచ్ శుక్రవారం నుంచి ప్రారంభమైంది. మొదట బ్యాటింగ్ ఆరంభించిన భారత్ తొలిరోజు ఆటముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 359 పరుగులు సాధించి, తిరుగులేని స్థితిలో నిలిచింది. శుభ్మన్ గిల్ (127), రిషభ్పంత్ (65) నాటౌట్గా ఉన్నారు. ఓపెనర్గా వచ్చి సెంచరీ బాదిన యశస్వి జైస్వాల్ .. బ్రాడ్మన్ రికార్డ్ను బద్దలుకొట్టాడు. జైస్వాల్ ఇప్పటివరకు ఇంగ్లండ్తో ఆడిన 10 ఇన్నింగ్స్ల్లో 90.33 యావరేజ్తో 813 పరుగులు సాధించాడు. దీంతో అతడు.. డాన్ బ్రాడ్మన్ను ఇంగ్లాండ్పై యావరేజ్ విషయంలో (మినిమం 500 పరుగులు) అధిగమించాడు. బ్రాడ్మన్.. ఇంగ్లిష్ టీమ్పై 63 ఇన్నింగ్స్ల్లో 89.78 సగటుతో 5,028 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ టీమ్ మీద 90 ప్లస్ యావరేజ్ కలిగిఉన్న ఏకైక బ్యాటర్గా యశస్వి జైస్వాల్ నిలిచాడు.
అలాగే ఈ మ్యాచ్లో టీమ్ఇండియా కెప్టెన్.. శుభ్మన్ గిల్ 2000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అద్భుత ఇన్నింగ్స్ ఆడిన గిల్ 175 బంతుల్లో 127 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇందులో 16 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. అలాగే వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ 3000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. అతడు 102 బంతుల్లో 65 పరుగులతో నాటౌట్గా ఉన్నాడు. ఇందులో 6 ఫోర్లు, 2 సిక్స్లున్నాయి. గిల్, పంత్ వీరిద్దరూ కలిసి మొదటిరోజు ఆట ముగిసే సమయానికి, నాలుగో వికెట్కు 198 బంతుల్లో 138 పరుగులు జోడించారు.