ఆచార్య మాడభూషి శ్రీధర్
నవతెలంగాణ – నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి : సమాజంలో జరుగుతున్న చెడును నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి అని పూర్వ కేంద్ర సమాచార కమిషనర్ , ప్రముఖ జర్నలిస్టు ఆచార్య మాడభూషి శ్రీధర్ పేర్కొన్నారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వేదికగా శనివారం కేఎల్ రెడ్డి స్మారకార్థం తలపెట్టిన మొట్టమొదటి ఉపన్యాసం “నేటి మీడియా” అనే అంశంపై ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.
కే ఎల్ రెడ్డి అక్షరాన్ని ఆలంబనగా చేసుకొని సమాజ హితేషిగా, సహేతుకమైన ప్రశ్నలు సంధిస్తూ నైతిక శిఖరంగా నిలిచి నేటి తరం జర్నలిజానికి ఆదర్శప్రాయంగా నిలిచారన్నారు. విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని సూచించారు. సామాజిక రాజకీయ ఆర్థిక అంశాలపై నిరంతర అధ్యయనం, దృక్పథం, దార్శినికతతో తమదైన వ్యక్తీకరణ అవసరమన్నారు. రాజ్యాంగ విలువల రక్షణకు వాక్ స్వాతంత్రాన్ని కాపాడుకునే దిశగా ముందుకు సాగాలని సూచించారు. సాంకేతికతను వినియోగించి విద్యార్థులు తమదైన వ్యక్తీకరణ తో మార్పుకు బాటలు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ ఆచార్య అలువాల రవి, డెవలప్మెంట్ డైరెక్టర్ ఆచార్య ఆకుల రవి, ఆర్ట్స్ మరియు సోషల్ సైన్స్ డీన్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, కేఎల్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆచార్య ఇంద్రసేనారెడ్డి, పూర్వ రిజిస్ట్రార్ ఆచార్య కే నరేందర్ రెడ్డి, లింగారెడ్డి, జలంధర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, విజయేందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.