నవతెలంగాణ-హైదరాబాద్: ఢిల్లీ నుంచి భోపాల్ వెళ్తున్న వందేభారత్ రైలులో బీజేపీ ఎమ్మెల్యే అనుచరులు అరాచకం సృష్టించారు. యూపీలోని ఝాన్సీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రాజీవ్ సింగ్ తన భార్య, కుమారుడితో కలిసి వందేభారత్ రైలు ఎక్కారు. అయితే ఓ బోగీలో ఎమ్మెల్యే సింగ్కు సీటు ఓ చోట, తన ఫ్యామిలీ సభ్యులకు మరో చోటు సీటు దొరికింది. కుటుంబసభ్యులు కూర్చున్న చోట మరో ప్రయాణికుడు కూర్చుకున్నాడు. అయితే సీటు మారేందుకు అతను నిరాకరించాడు. దీంతో ఎమ్మెల్యే ఫ్యామిలీకి, ఆ వ్యక్తికి మధ్య గొడవ జరిగింది.
అయితే ఝాన్సీ రైల్వే స్టేషన్ కు రైలు చేరుకున్న తర్వాత ఎమ్మెల్యేకు సంబంధించిన వ్యక్తులు వచ్చి ఆ ప్రయాణికుడిపై దాడికి పాల్పడ్డారు. ఆ ప్రయాణికుడిపై సుమారు డజన్ మంది ఏకపక్షంగా దాడి చేశారు. చెప్పులతోనూ అతనిపై విరుచుకుపడ్డారు. అతని శరీరం, దుస్తులు మొత్తం రక్తంతో నిండిపోయాయి. ఈ ఘటనపై ఝాన్సీ ఎస్పీ విపుల్ కుమార్ శ్రీవాత్సవ్ కేసు బుక్ చేసి విచారణ మొలుపెట్టారు.
సీట్లు మార్పు విషయంలో గొడవ జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా సరైన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే సింగ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎన్సీఆర్ కేసు బుక్ చేశారు. భార్య పిల్లలతో ప్రయాణిస్తున్న సమయంలో.. తోటి ప్రయాణికుడు తన కుటుంబంతో దురుసుగా ప్రవర్తించినట్లు ఎమ్మెల్యే తన ఫిర్యాదులో పేర్కొన్నారు.