నవతెలంగాణ-హైదరాబాద్: భూమ్మీద నూకలుంటే..ఎంత పెద్ద ప్రమాదం జరిగినా ప్రాణాలతో బయటపడొచ్చు అనే ఉదంతాలు చాలానే చూసి ఉంటాం. ఇటీవల జూన్ 12న అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కూడా విశ్వాస్ పర్వేశ్ అనే ప్రయాణికుడు మృత్యుంజయుడిగా నిలిచాడు. అదే విధంగా గ్యాస్ లీక్ కావడంతో ఓ ఇంట్లో సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కానీ ఇంటీ దంపతులకు మాత్రం పేలుడు ధాటికి ఎలాంటి గాయాలు కాకుండా తృటిలో తప్పించుకున్నారు.
ముంబయిలోని ఓ ఇంట్లో భయానక ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ తమ ఇంట్లో గ్యాస్స్టౌవ్కు సిలిండర్ బిగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ గ్యాస్ పైప్ ఊడిపోయింది. దానిని తిరిగి పెట్టడానికి ప్రయత్నించినప్పటికీ పైపులో నుంచి గ్యాస్ ఎగజిమ్మడంతో సాధ్యం కాలేదు. దీంతో సిలిండర్ను కిచెన్లో నుంచి బయటకు తెచ్చి హాల్లో పడేసిన ఆ మహిళ భయంతో బయటకు పరుగులు తీసింది. సిలిండర్ కిందపడి ఉండడంతో పైప్ నుంచి లీక్ అయిన గ్యాస్ ఇళ్లంతా వ్యాపించింది. ఆ తర్వాత సిలిండర్లో గ్యాస్ ఖాళీ అయిందని ఇంట్లోకి వచ్చిన ఆ దంపతులు సిలిండర్ను అక్కడినుంచి తీయడానికి ప్రయత్నించగా.. వంటగది నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాప్తించాయి. అప్రమత్తమైనా ఆ ఇద్దరు వ్యక్తులు వెంటనే ఇంటి నుంచి పరుగులు తీసి ప్రాణాలతో బయటపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.