”నువ్వొక పాపాత్ముడివి, నీదంటూ ఏదీ లేదు. ఆ దేవదేవుడికి నిన్ను నీవు సమర్పించుకోవడం లోనే నీ జన్మ ధన్యమౌతుంది” -అని మతం మనిషిని బలహీనపరుస్తుంది. దేవుణ్ణి నమ్మడం, నమ్మక పోవడం అనేది వారివారి వ్యక్తిగత విషయం. నిజానికి ప్రతి జీవి ప్రత్యేకమైందే. ప్రతి మనిషీ ప్రత్యేకమైన వాడే. ఒక నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పరుచుకుని, ఒక ధ్యేయం కోసం తనను తాను అర్పించుకున్నవాడు తప్పకుండా ప్రత్యేకమైన వాడే! తను జీవిస్తున్న సమాజపు బాగోగులు ఆలోచించ గలవాడు, దాన్ని ముందుకు నడిపించాలని తపించి పోయేవాడు మహనీయుడు కాక మరేమవుతాడు? మహాత్ములంతా మామూలు మనుషులుగా పుట్టిన వారే. వారు చేసిన కృషి వల్ల మహాత్ములయ్యారు తప్పితే, పుట్టుకతోనే మహాత్ములయిన వారు ఎవరూ లేరు. ఎవరూ ఉండరు.
మన భారతదేశంలో సాంఖ్యక శాస్త్రానికి(STATISTICS)గుర్తింపు తెచ్చిన మహలనోబిస్ ప్రశాంతచంద్ర అనే శాస్త్రవేత్త ఇలాంటి వాడే. ఎంతోమంది లాగా ఈయన కూడా విదేశాలకు వెళ్లాడు. పరిశోధనలు చేశాడు. తిరిగి వచ్చిన తరువాత, సాంఖ్యక శాస్త్రానికి సరైన గుర్తింపు లేదన్న విషయం గుర్తించాడు. అందుకు కృషి చేయడమే తన జీవిత ధ్యేయమనుకున్నాడు – అలాగే చేశాడు. అందుకే తర్వాత తరంలో ఈ శాస్త్రానికి విశేష మైన గుర్తింపూ, ఆదరణా లభించాయి. ఇక ఇప్పుడు ఈ గణాంక పరిజ్ఞానం లేకుండా ఏ పరిశోధనా ముందుకు సాగడం లేదు. గొప్ప చదువులు చాలామంది చదువుతారు. వాళ్లంతా గొప్ప వాళ్లయిపోరు. సమాజపు అవసరాలేవో గుర్తించి, వాటిని పూర్తి చేయగలిగిన వారు మాత్రమే గొప్ప వాళ్లవుతారు.అలాంటి ఆలోచన, దానికి తగిన కృషి ప్రశాంత చంద్ర చేయగలిగాడు. అందుకే సాటిస్టిక్స్లో ‘మహలనోబిస్ దూరం’ అనే సూత్రం ఉంది. అది, ఆయన రూపకల్పన చేసిందే! సాంఖ్యక శాస్త్రంలో దానికి ఒక ప్రాముఖ్యం ఉంది. పంట దిగుబడి ఎంత?- అని చెప్పడానికి ప్రశాంత చంద్ర మొట్టమొదటిసారి కొన్ని నమూనాలను తీసుకుని సాంఖ్యక శాస్త్రరీత్యా ఫలితాలను ప్రకటించాడు.అది వర్గీకరణలో ఒక మూల సూత్రమైంది!
ప్రశాంతచంద్ర మహలనోబిస్ 29 జూన్ 1893లో బెంగాల్లో పుట్టాడు. 1912లో కలకత్తా విశ్వ విద్యాలయం నుండి పట్టభద్రుడయ్యాడు. తర్వాత ఉన్నత విద్యకోసం ఇంగ్లాండు వెళ్లాడు. ఆ రోజుల్లో దేశం బ్రిటీషు పాలనలో ఉంది గనుక, ఆ తరం వాళ్లంతా ఉన్నత విద్యకోసం ఇంగ్లాండే వెళ్లేవారు. మన దేశ నాయకులు గాంధీ, నెహ్రూలే కాదు, ఇంకా ఎంతోమంది అక్కడి నుండే బార్ ఎట్-లా లు అయ్యారు. అలాగే ఎంతో మంది వైజ్ఞానికులు కూడా! మహలనోబిస్ అకడి కేంబ్రిడ్జి వెళ్లి, అక్కడి నుండి యం.ఎ. పట్టా తీసుకున్నాడు. స్వదేశానికి తిరిగివస్తూనే, 1915లో తను చదువుకున్న కలకత్తా విశ్వవిద్యాలయం-ఫిజిక్స్ విభాగంలో ఆచార్యుడిగా చేరాడు. ఒక ఏడేండ్ల తర్వాత అదే విభాగానికి అధిపతి అయ్యాడు. కాలక్రమంలో 1945లో కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలకు ప్రిన్సిపాల్ అయ్యాడు. అయితే ఇవన్నీ మామూలు విషయాలు. ఆ రంగంలో పదోన్నతి సాధించడం అందరూ చేస్తారు. ప్రశాంత చంద్ర గొప్పతనం అందులో లేదు. ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే, మరోవైపు దేశంలో సాంఘిక శాస్త్రానికి ప్రాముఖ్యం తేవడానికి చేసిన కృషి గణనీయ మైంది. ఒక కొత్త విధానం, ఒక కొత్త సైన్సు చదువులో పరిశోధనల్లో వాడుకలోకి వచ్చింది. అందుకే చూడండి, అన్ని రంగాల్లో స్టాటిస్టిక్స్ అవసరం బాగా పెరిగింది. డేటా ఏదైనా సరే – విశ్లేషించుకోవాలంటే స్టాటిస్టిక్సే తప్పనిసరి అయ్యింది!
ప్రశాంత చంద్ర కేంబ్రిడ్జిలో ఉన్నప్పుడు అక్కడ గాసెట్టి, కార్ల్పియర్ సన్ ప్రభృతులు ఆయనను ఎంతగానో ప్రభావితం చేశారు. వారి దగ్గర నేర్చుకున్న సాంఖ్యకశాస్త్ర విశేషాలు ఆయనను అమితంగా ఆకర్షించాయి. ఈ శాస్త్రాన్ని ఒక అధ్యయన విషయంగా భారతీయ విశ్వ విద్యాలయాలు ఎందుకు స్వీకరించడం లేదూ? అని ఆయన ఆలోచించాడు. ఆ ఆలోచనను ఆచరణలో పెట్టాడు. ప్రయత్నాలు ముమ్మురం చేశాడు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్కు రూపకల్పన చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. దానికి డైరెక్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించి, ఆ సంస్థకు అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చాడు. 17 డిసెంబర్ 1931న కలకత్తా ప్రెసిడెన్సీలో కాలేజీలో దాన్ని ఒక చిన్న సంస్థగా ప్రారంభించాడు. 1959లో భారత పార్లమెంట్ దానికి జాతీయ స్థాయినిస్తూ చట్టం చేసింది. పెద్ద సంస్థగా అభివృద్ధి చేసింది. అప్పటి నుండి అక్కడ సాంఖ్యక శాస్త్రం బోధన ప్రారంభమైంది. పరిశోధనలు ప్రారంభమయ్యాయి. దాన్ని అనేక పరిశ్రమలకు అనుసంధానం కూడా చేశారు. ఆ తర్వాత ఈసంస్థ శాఖలు దేశవ్యాప్తమయ్యాయి. మన హైదరాబాదులో కూడా 1974 నుండి ఈ సంస్థ (ఐఎస్ఐ) పని చేస్తూ ఉంది. హబ్సిగూడలో ఉన్న ఈ సంస్థలో పి.జి. కోర్సులు చెయొచ్చు. పరిశోధనలు కూడా చెప్పొచ్చు. దీన్ని భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది.
ప్రశాంత చంద్ర మహలనోబిస్ ఆధ్యయనం చేసింది భౌతిక శాస్త్రమే అయినా, ఫిజిక్స్ ప్రొఫెసర్గా ఏండ్లకేండ్లు కొనసాగినా, స్టాటిస్టిక్స్పై ఆయనకు ఉన్న మక్కువ వృథా కాలేదు. దేశంలో విజ్ఞాన శాస్త్రంలో ఒక శాఖ నిలదొక్కుకుని, వేళ్లూనడానికి దోహదం చేసింది. 1949లో భారత ప్రభుత్వం స్టాటిస్టికల్ సైన్స్కు సంబంధించి ఆయనను కౌన్సిలింగ్ మెంబర్గా నియమించింది. 1958లో అధ్యాపక వృత్తి నుండి వైదొలగినా, మరికొంత కాలం కలకత్తా విశ్వవిద్యాలయంలో ఎమిరిటిస్ ప్రొఫెసర్గా ఉన్నాడు. ప్రొఫెసర్గా పదవీ విరమణ చేసిన వారి అనుభవం మరికొంతకాలం ఇటు విద్యార్థులకూ అటు విశ్వవిద్యాలయానికీ ఉపయోగపడే విధంగా గౌరవ వేతనంతో మరికొంత కాలం కొనసాగించడానికి అనువుగా ఎమిరిటిస్ ప్రొఫెసర్ హోదా ఇస్తారు. 1342లో ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఇంపైన్ (ఒ.బి.ఇ) లభించింది. 1945లో ఎఫ్.ఆర్.ఎస్ (Fellions of The Royal Society )కి ఎన్నికయ్యాడు. 1944లో వెల్డన్ మెమోరియల్ ఫ్రైజ్ లభించింది. ఇవన్నీ బ్రిటీష్ పాలన కాలంలో సాధించిన విజయాలైతే- స్వాతంత్య్రం లభించిన తర్వాత భారత తొలి ప్రధాని ఈయన కృషిని గుర్తించి, 1955లో ప్లానింగ్ కమిషన్ మెంబర్గా తీసుకున్నారు. 1968లో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించింది. గణాంక విజ్ఞానంలో చేసిన విశేషమైన కృషిని గుర్తుంచుకునే విధంగా 2007 నుండి ప్రతి సంవత్సరం జూన్ 29ని నేషనల్ స్టాటిస్టిక్స్డేగా జరుపుకుంటున్నాం. అంతేకాదు, పి.సి. మహలనోబిస్ను భారత గణాంక శాస్త్ర పితామహుడిగా గుర్తించుకున్నాం.
పి.సి.మహలనోబిస్ బిక్రమ్ పూర్, ఢాకా, బెంగాల్ ప్రెసిడెన్సీకి చెందిన ఒక బెంగాలి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. ఇప్పుడు ఆ ప్రాంతం బంగ్లాదేశ్లోకి వెళ్లింది. ఈయన తాత గురుచరణ్ 1854లో కలకత్తా నగరానికి వలస వచ్చాడు. అక్కడ కాస్త నిలదొక్కుకుని 1860లో ఒక కెమిస్ట్ షాపు ప్రారంభించి, జీవనం సాగించసాగాడు. ఈయన విశ్వకవి రవీంద్రుడి తండ్రి దేవేంద్రనాథ్ టాగూర్ ప్రభావంలో పడిపోయాడు. బ్రహ్మ సమాజంలో చురుకుగా పనిచేస్తుండేవాడు. దానికి అధ్యక్షుడై, 210 కార్న్ వాలిస్ స్ట్రీట్లో తన ఇంటినే కార్యాలయంగా మార్చాడు. అభ్యుదయ కామనతో పలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. ఆ క్రమంలో ఒక వితంతువును వివాహమాడి నాటి సమాజానికి ఆదర్శంగా నిలిచాడు. గురుచరణ్ చిన్న కుమారుడైన ప్రభోద్ చంద్ర, ఆయన కుమారుడు ప్రశాంత చంద్ర అందరికి అందరూ అదే కలకత్తా లోని కార్న్వాలిస్లో పుట్టి పెరిగినవారే! అలాంటి అభ్యుదయ వాతావరణంలో ఎదిగిన వారే!
ప్రశాంత చంద్ర మహలనోబిస్ కలకత్తాలోని బ్రహ్మ బార్సు స్కూల్లో చదువుకున్నాడు. ఆ తర్వాత కలకత్తా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ప్రెసిడెన్సీ కాలేజీలో చేరాడు. అక్కడ ఆయనకు సర్ జగదీశ్ చంద్రబోస్, ప్రపుల్ల చంద్రరే అధ్యాపకులుగా ఉండేవారు. ఇకపోతే ఈయనతో పాటు చదువుకున్న ప్రతిభావంతులైన విద్యార్థులు కొందరుండేవారు. వారిలో మేఘా నంద్ సాహా-మహలనోబిస్కు ఒక సంవత్సరం జూనియర్. సుభాస్ చంద్రబోస్-రెండేండ్లు జూనియర్. వారు కూడా మహనీయులౌతారని అప్పటికి ఎవరూ ఊహించి ఉండరు. కానీ, కాలక్రమంలో ఒకరు వైజ్ఞానిక రంగంలో – మరొకరు స్వాతంత్రోద్యమంలో మహాన్నతమైన పాత్ర పోషించారు. కేంబ్రిడ్జిలో ఉన్నప్పుడు మహలనోబిస్కు లాంగ్వాక్స్కు వెళ్లడం అలవాటుగా ఉండేది. అలా అక్కడ భారత గణిత శాస్త్ర మేధావి శ్రీనివాస రామానుజన్ పరిచయం ఏర్పడింది. ఇక, ప్రశాంత చంద్ర వివాహం 27 ఫిబ్రవరి 1923న కలకత్తాలో నిర్మల కుమారి (రాణి)తో జరిగింది. వారిది కూడా బ్రహ్మసమాజ – నేపథ్యం ఉన్న కుటుంబమే!
సాంఖ్యక శాస్త్ర (గణాంక శాస్త్ర నిపుణుడిగా మహలనోబిస్ చేసిన కృషికి ఎన్నో విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ప్రకటించాయి. జకోస్లొవాకియా అకాడెమీ 1964లో ఆయనకు గోల్డ్ మెడల్ బహుకరించింది. ”సాంఖ్యక” అనే వైజ్ఞానిక పత్రికకు ఈయనే ఫౌండర్ మెంబర్. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ కాన్ఫరెన్స్కు, ఇండియన్ స్టాటిస్టీసియన్స్ సంఘానికి ఛైర్మన్గా వ్యవహరించాడు. అన్నింటినీ మించి తొలి భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ, విశ్వకవి రవీంద్ర నాథ్ టాగూర్ల అభిమానాన్ని, ఆత్మీయతను చవిచూసిన మంచి మనిషి మహలనోబిస్. అయితే, కాలం దయలేనిది. ఎంతటి మంచివారికైనా, ఎంతటి మహనీయులకైనా మరణం తప్పదు. 1972 జూన్ 28న కాలం ఆయన జీవి తంలో చివరిలెక్క పూర్తి చేసింది. సాంఖ్యక గణితంలో ప్రశాంతచంద్ర మహలనోబిస్ చిరంజీవి! ఆయన అంకెల్లో – బతుకుతూనే ఉన్నాడు.
(పి.సి.మహలనోబిస్ జయంతి 29 జూన్; వర్థంతి 28 జూన్)
– కవిరాజు త్రిపురనేని రామస్వామి
జాతీయ పురస్కార తొలి గ్రహీత
సాంఖ్యక శాస్త్ర పితామహుడు పి. సి. మహలనోబిస్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES