ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్
నవతెలంగాణ – జుక్కల్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొన్ని రోజులుగా కొనసాగుతున్న తీవ్రమైన ఉక్కపోత, వేడిమి నుంచి ప్రజలకు ఉపశమనం లభించనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు నిజామాబాద్ , కామారెడ్డి జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ వాతావరణ మార్పులు వేసవి తాపం నుండి ఉపశమనం కల్పించడమే కాకుండా, ఖరీఫ్ సీజన్ సాగు పనులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయని రైతులు ఆశిస్తున్నారు.
ఉమ్మడి కామారెడ్డి , నిజామాబాద్ జిల్లాకు హెచ్చరికలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ ఉపరితల ఆవర్తనం క్రమంగా బలపడుతూ.. జిల్లా వాతావరణంలో గణనీయమైన మార్పులకు కారణం కానుంది. దీని ప్రభావంతో కామారెడ్డి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అంటే.. ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిడుగుపాటు ప్రమాదాలపై ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో, ఎత్తైన చెట్ల కింద ఉండరాదని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ వర్షాలు రైతన్నలకు శుభసూచకంగా మారనున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు వర్షాలు కురవడం వల్ల భూమి సాగుకు సిద్ధమవుతుంది. విత్తన శుద్ధి, ఎరువుల నిల్వ వంటి పనులు సకాలంలో ప్రారంభించడానికి వీలవుతుంది. వ్యవసాయ నిపుణులు రైతులను తమ సాగు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు. అయితే.. భారీ వర్షాల కారణంగా కొన్ని లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యే ప్రమాదం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది.
మండలంలోని పల్లెలు, మండల కేంద్రంలోని ప్రాంతాల్లో మురుగునీటి పారుదల వ్యవస్థలు సరిగా లేని చోట్ల నీరు నిలిచిపోయి, ట్రాఫిక్కు అంతరాయం కలిగే ప్రమాదం ఉంది. ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా డ్రైవర్లు అప్రమత్తంగా వాహనాలు నడపాలని సూచించారు. పశువులకు, ఇతర పెంపుడు జంతువులకు కూడా తగిన రక్షణ కల్పించాలని సూచించారు.
ఈ అకాల వర్షాలు రుతుపవనాల రాకకు ముందు సూచికగా భావిస్తున్నారు. జుక్కల్ మండలంతో పాటు తెలంగాణకు వ్యవసాయ రంగం వెన్నెముక కాబట్టి, సకాలంలో సరిపడా వర్షాలు కురవడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. మెరుగైన వర్షపాతం పంట దిగుబడులను పెంచి, రైతుల ఆదాయాన్ని స్థిరీకరిస్తుంది. మండల, జిల్లా , విపత్తు నిర్వహణ సంస్థలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వాతావరణ మార్పులను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని అధికారులకు సూచించారు.