Monday, June 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఈ గడ్డపై విద్వేషాలేంటి?

ఈ గడ్డపై విద్వేషాలేంటి?

- Advertisement -

– హేతు, భౌతిక వాదాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
– విద్వేషాలతో ప్రజల్ని విడగొట్టేది హేట్‌వాదం
– ప్రమాదకర స్థితిలో కుల, మత, పార్టీతత్వాలు
– బుల్డోజర్‌ రాజకీయాల వెనుక కార్పొరేట్ల ఆర్థిక ప్రయోజనాలూ..: ప్రముఖ జీవశాస్త్రవేత్త, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత ప్రొఫెసర్‌ దేవరాజు మహారాజు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

ప్రపంచానికి హేతువాదాన్నీ, భౌతికవాదాన్నీ పరిచయం చేసిందే భారతీయులనీ, ఇలాంటి గడ్డపై అధికారం కోసం పాలకుల విద్వేష రాజకీయాలు, ద్వేషపూరిత ప్రసంగాలు ఏంటని ప్రముఖ జీవ శాస్త్రవేత్త, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత ప్రొఫెసర్‌ దేవరాజు మహారాజు ప్రశ్నించారు. నేడు దేశంలో హేట్‌వాదం పెచ్చరిల్లిపోతున్న తీరుపట్ల ఆందోళన వ్యక్తం చేశారు. కుల, మత తత్వాలకు తోడుగా పార్టీ తత్వం కూడా తీవ్రరూపం దాల్చడం ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రజలకు హేతువాదంపై అవగాహన కల్పించేందుకు ప్రజాస్వామిక వాదులు, భౌతికవాదులు, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకునేవారు, ఇలా ప్రతిఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ‘హేతు వాదమా? హేట్‌వాదమా? ప్రపంచానికి ఏది కావాలి?’ అనే అంశంపై సుందరయ్యవిజ్ఞాన కేంద్రం మేనేజింగ్‌ కమిటీ కార్యదర్శి ఎస్‌.వినయకుమార్‌ సమన్వ యంతో ఆదివారం నిర్వహించిన వెబినార్‌లో దేవరాజు మహారాజు మాట్లాడారు. బీజేపీ పాలకుల బుల్డోజర్‌ రాజకీయాల వెనుక రాజకీయ లబ్దితో పాటు కార్పొరేట్ల ఆర్థిక ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయని ఎత్తిచూపారు. మహారాష్ట్రలోని ముంబయి నడిబొడ్డున ఉన్న ప్రముఖ జైన మందిరాన్ని బుల్డోజర్లతో ఫడ్నవిస్‌ ప్రభుత్వం కూల్చేసిందన్నారు. ఆరు నెలల క్రితం రెన్యువేషన్‌కు అనుమతి ఇచ్చిన అదే సర్కారు ఇప్పుడు ఆ కట్టడాన్ని కూల్చిందనీ, లోతుల్లోకి వెళ్లిచూస్తే దాని పక్కనే ఉన్న ఓ కార్పొరేట్‌ హోటల్‌ విస్తరణ కోసం ఈ పనిచేసిందని వెల్లడైందన్నారు. ముంబయిలోని జైనులు పెద్ద వ్యాపారులనీ, వారు ఎక్కువ సంఖ్యలో బీజేపీ వెనుకాలే ఉన్నారని గుర్తుచేశారు. ఇప్పుడు బీజేపీకి కార్పొరేట్ల ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి మైనార్టీలైన జైనులను పక్కనబెట్టేసిందని విడమర్చి చెప్పారు. ఇదే పద్ధతిలో ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, తదితర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగిన పలు ఘటనలను ఉదహరణలతో వివరించారు. దేశంలో మోడీ సర్కారు వచ్చాక విద్వేషపూరిత ఉప న్యాసాలు, మారణహోమాలు పెరిగాయని ఏపీసీఆర్‌ నివేదిక ఎత్తిచూపిన అంశాన్ని ప్రస్తావిం చారు. ప్రధాని, బీజేపీ పాలిత సీఎంలు, కేంద్ర మంత్రులు, ఎంపీలు..ఇలా కీలకమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు విద్వేషపూరిత ప్రసంగాలు చేయడమేంటని ప్రశ్నించారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న గవర్నర్లు, ఇద్దరు జడ్జీలు కూడా అదే బాటలో నడవటం పట్ల ఆందోళన వెలిబుచ్చారు. మీడియా కూడా కేంద్ర పాలకుల మైకంలో పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వార్తలు సేకరించి..ముద్రించి పాఠకులకు మీడియా యాజమాన్యాలు అమ్మేవనీ, ఇప్పుడు ముందే అమ్ముడుపోతున్నాయని ఆరోపించారు. మనం నాగరిక సమాజంలో ఉన్నామా? అనాగరిక సమాజంలో ఉన్నామా? అని ప్రశ్నించారు. ప్రశ్నించేవారిని హిందూత్వ శక్తులు మట్టుబెడుతున్న తీరుపట్ల ఆందోళన వ్యక్తంచేశారు. ఇలాంటి ధోరణి దేశానికే ప్రమాదకరమని హెచ్చరించారు.
ఆయుధాల వ్యాపారం కోసమే యుద్ధాలు
రష్యా-ఉక్రెయిన్‌, ఇజ్రాయిల్‌-పాలస్తీనా మధ్య ఏండ్ల తరబడి, తాజాగా ఇజ్రాయిల్‌-ఇరాన్‌ మధ్య యుద్ధాలు కొనసాగుతున్నాయనీ, ప్రపంచవ్యా ప్తంగానూ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయని దేవరాజు మహారాజు ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఆయుధ వ్యాపారాల విస్తరణ కోసం అమెరికా లాంటి దేశాలు యుద్ధాలను ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు. కూర్చొని శాంతిమార్గంలో సమస్యలను పరిష్కరించుకునే అవకాశమున్నా ఇలా చేయడం ప్రపంచానికి మంచిది కాదని హితవు పలికారు. పెహల్గాంలో ఉగ్రదాడి ఎందుకు జరిగింది? ప్రధాని మోడీకి చెప్పుకోండి అని ఉగ్రవాదులు అనడమేంటి? అంతకు ముందే అక్కడ మిలిటరీ బేస్‌ క్యాంపు ఎందుకు ఎత్తేశారు? ఇంటిలిజెన్స్‌ వ్యవస్థ ఎందుకు పసిగట్టలేకపోయింది? ఇప్పటి వరకూ ఉగ్రవా దులను ఎందుకు పట్టుకోలేకపోయింది? వీటన్నిం టికీ మోడీ సర్కారు సమాధానాలు చెప్పాలన్నారు. ప్రశ్నించేవారిని తప్పుబట్టడం సరిగాదన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -