నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తాజాగా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, విద్యార్థులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, సమగ్రమైన హెల్త్ కార్డులను రూపొందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా మెడికల్ అండ్ హెల్త్ అధికారులకు సూచించారు.
also raed తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం ..
విద్యార్థులకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే, ఆన్లైన్ ద్వారా కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి ఉచిత వైద్య సేవలు అందించేందుకు అవి సంసిద్ధంగా ఉన్నాయని, ఆ సేవలను వినియోగించుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. మంగళవారం ప్రజాభవన్లో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ఆయన ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. హాస్టళ్లు, గురుకులాలను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, ఏ అధికారి ఏ రోజు పర్యటించారు, ఏ అంశాలను పరిశీలించారు అనే దానిపై ఎప్పటికప్పుడు నివేదికలు రూపొందించాలని సూచించారు.
సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల్లో అధికారుల పర్యటనలు, సమీక్షల కోసం పకడ్బందీగా విజిట్ క్యాలెండర్ను రూపొందించాలని డిప్యూటీ సీఎం సంక్షేమ శాఖల అధికారులను ఆదేశించారు. ఈ పర్యటన కార్యక్రమంలో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలను సైతం భాగస్వామ్యం చేయాలని సూచించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని, డైట్ ఛార్జీలను 40 శాతం, కాస్మోటిక్ ఛార్జీలను 200 శాతం పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. డాక్టర్ల సూచనల మేరకు పకడ్బందీ మెనూను ఖరారు చేశామని, ఈ మెనూ అన్ని సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో ప్రముఖంగా కనిపించేలా బ్యానర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.