నవతెలంగాణ- హైదరాబాద్ : టాలివుడ్ నటుడు ఫిష్ వెంకట్ మరోసారి ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం వెంటిలేటర్ మీదున్న ఆయన ఎదుటి వ్యక్తిని కనీసం గుర్తుపట్టలేకపోతున్నారు. వెంకట్ కిడ్నీల ఫెయిల్యూర్తో తొమ్మిది నెలల నుంచి డయాలసిస్ తీసుకుంటున్నారు. తాజాగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబసభ్యులు ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉండటంతో వైద్య ఖర్చులు భరించలేకపోతున్నామని.. ఎవరైనా దాతలు తమను ఆదుకోవాలని కుటుంబసభ్యులు వేడుకుంటున్నారు.
తెలుగు సినిమాల్లో విలన్ పక్కన ఉండే రౌడీలుగా చాలామంది నటిస్తుంటారు. అయితే అందులో ప్రేక్షకులకి గుర్తుండిపోయే నటుడిగా ఫిష్ వెంకట్ నిలిచాడు. ఆయన సీరియస్గా కత్తి ఎత్తినా ప్రేక్షకులకి నవ్వే వస్తుంది. సీరియస్ విలన్ పక్కన ఉంటూనే నవ్వులు పూయించడం ఆయన ప్రత్యేకత. ఎన్టీఆర్, వీవీ వినాయక్ కాంబినేషన్లో వచ్చిన ‘ఆది’ సినిమా తొడకొట్టు చిన్నా అంటూ ఒక్క డైలాగ్తో పాపులర్ అయ్యాడు వెంకట్. ఆయనకు నాలుగేళ్ల క్రితం షుగర్ కారణంగా కాలు ఇన్ఫెక్షన్ అయింది. తమను ఆదుకోవాలని ఫిష్ వెంకట్ వేడుకోవడంతో పలువురు సినీతారలతో పాటు బయటి నుంచి దాతలు కూడా సాయం చేశారు. దీంతో డాక్టర్లు ఆయన కాలికి ఆపరేషన్ చేసి బ్రతికించారు.
ఆ దెబ్బతో సినిమా అవకాశాలు రాక కుటుంబ పరిస్థితి దీనంగా మారింది. కుటుంబసభ్యులే ఆయన్ని సాకుతున్నారు. అయితే మళ్లీ ఆయన తాగుడుకి అలవాటు పడటంతో రెండు కిడ్నీలు పాడవడంతో ఆస్పత్రిలో చేర్చారు. వారం రోజులుగా వెంటిలేటర్పైనే ట్రీట్మెంట్ పొందుతున్నారు.