రెండు, మూడు మున్సిపాల్టీలకో అధికారి
ఎక్కడా సరైన న్యాయం చేయలేకపోతున్న టీపీఓలు
మున్సిపాల్టీల్లో జోరుగా అక్రమ కట్టడాలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాల్టీలను టౌన్ ప్లానింగ్ అధికారుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆయా మున్సిపాల్టీల్లో ప్రాధాన్యత గల టీపీఓ పోస్టులు ఖాళీగా ఉండటంతో పాలనా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్క టౌన్ ప్లానింగ్ అధికారి రెండు, మూడు మున్సిపాల్టీల కు ఇన్చార్జిగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కడా సమర్థవంతంగా పనిచేయలేని పరిస్థితుల్లో.. అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. టీపీఓల కొరతతో మున్సిపాల్టీల్లో పర్యవేక్షణ కొరవడి అక్రమ కట్టడాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇటీవల చేపట్టిన 100 రోజుల పట్టణ ప్రణాళిక సైతం నత్తనడకన సాగుతున్నట్టు వినికిడి.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఉన్న 15 మున్సిపాల్టీలకు సరిపడా టౌన్ ప్లానింగ్ అధికారులు (టీపీఓ) లేరు. సగానికిపైగా ఖాళీలు ఉన్నాయి. పాత మున్సిపాల్టీలకే పూర్తి స్థాయిలో టీపీఓలకు లేకపోగా.. కొత్త మున్సిపా ల్టీల్లోనూ ఇదే సమస్య ఎదురవుతోంది. ఇటీవల జిల్లాలో 3 కొత్త మున్సిపాల్టీలు ఏర్పడ్డాయి. పాత మున్సిపాల్టీలకే టౌన్ ప్లానింగ్ అధికారులను సర్దుబాటు చేయలేక సతమతమవుతున్న అధికారులకు కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలకు ‘టీపీఓ’లను ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కాక తలలు పట్టుకు నే పరిస్థితి. ఈ క్రమంలో అక్రమ నిర్మాణాలు మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.
అక్రమాలపై కొరవడిన పర్యవేక్షణ
మున్సిపాల్టీల్లో కమిషనర్ తర్వాత అత్యంత ప్రాధాన్యత గల పోస్టు టౌన్ ప్లానింగ్ అధికారి. అభివృద్ధికి సంబంధించి అనేక విధులను వీరు నిర్వహిస్తుంటారు.పట్టణ ప్రణాళిక రూపకల్పన, అనుమతుల జారీ, అక్రమ కట్టడాల కట్టడి.. అంతా టీపీవోల పర్యవేక్షణలో నే ఉంటుంది. ఇంత ప్రాధాన్యత గల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఒక్కో టీపీఓకు రెండు నుంచి మూడు మున్సిపాల్టీల బాధ్యతలు అప్పగించడం తో క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు తలెతుత్తున్నా యి. ఈ టీపీఓలు ఏ మున్సిపాల్టీకీ సరైన న్యాయం చేయలేకపోతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అక్రమ కట్టడాలను నివారించడంలో విఫలమవుతున్నా రని ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీర్ఘకాలికంగా పోస్టులను భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచడంతో మున్సిపాల్టీల్లో పాలన సైతం అస్తవ్యస్తంగా మారింది. టీపీఓలకు సొంత మున్సిపాల్టీతోపాటు అదనపు బాధ్యతలు తోడు కావడంతో పని ఒత్తిడితో సరిగా పట్ట్టించుకోకపోవడంతో అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మూడు రోజులకో మున్సిపాల్టీ..
గుండ్లపోచంపల్లి, మేడ్చల్, తూముకుంట మున్సిపాల్టీలకు రెగ్యులర్ టీపీఓలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దుండిగల్ టీపీఓ గుండ్లపోచంపల్లి మున్సిపాల్టీకి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. మూడు రోజులు దుండిగల్, మరో మూడు రోజులు గుండ్ల పోచంపల్లి మున్సిపాల్టీని చూసుకోవాల్సి వస్తోంది. రెగ్యులర్ టీపీఓలు లేకపోవడం వల్ల బిల్ కలెక్టర్లకు ఆ బాధ్యతలను అప్పగించి మ.మ. అనిపిస్తున్నారు. ఎవరికైనా టీపీఓతోనే పని ఉంటే మాత్రం అతను వచ్చే వరకు ఆగాల్సిందే. మేజర్ మున్సిపాల్టీ అయిన మేడ్చల్ మున్సిపాల్టీ టీపీఓకు మూడు మున్సిపాల్టీల బాధ్యతలు అప్పగించారు. దీనివల్ల ఆ టీపీఓ ఏ మున్సిపాల్టీకీ న్యాయం చేయలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఒకేసారి మూడు మున్సిపాల్టీల బాధ్యతలను నిర్వహించడం వల్ల ప్రజలకు ఆ ప్లానింగ్ అధికారి అందుబాటులో ఉండటం లేదన్న ఆరోపణలు లేకపోలేదు.
కొత్త మున్సిపాల్టీలదీ అదే పరిస్థితి..!
జిల్లాలోని ఎల్లంపేటతోపాటు అలియాబాద్, మూడుచింతలపల్లి మున్సిపాల్టీలు కొత్తగా ఏర్పడ్డాయి. ఈ మూడు మున్సిపాల్టీలకు ఇన్చార్జి టీపీఓలే దిక్కయ్యారు. పట్టణాలు అభివృద్ధి చెందాలన్నా.. పట్టణ ప్రణాళిక రూపకల్పనకైనా రెగ్యులర్ టౌన్ప్లాన్ అధికారి ఉంటేనే న్యాయం జరుగుతుంది. ఇలాంటి కీలక పోస్టులను దీర్ఘకాలికంగా భర్తీ చేయకుండా ఉండటం పట్ల సర్వత్రా వివర్శలు వెల్లువెత్తుతున్నాయి.