- – ఆయిల్పై వెల్డింగ్ నిప్పు రవ్వలు పడి మంటలు
నవతెలంగాణ-దామరచర్ల:
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న యాదాద్రి పవర్ ప్లాంట్లో సోమవారం తెల్లవారు జామున అగ్నిప్రమాదం జరిగింది. 4 వేల మెగావాట్ల సామర్థ్యం గల ఈ ప్లాంట్లో ఎనిమిది వందల మెగావాట్ల సామర్థ్యం గల ఐదు యూనిట్లను నిర్మిస్తున్నారు. గత సంవత్సరం రెండు, మూడు యూనిట్లను ప్రారంభించి జాతికి అంకితం చేయగా, మిగిలిన మూడు యూనిట్లలో యూనిట్-1 నిర్మాణ పనులు పూర్తయ్యాయి. వచ్చే నెలలో దానిని ప్రారంభించేందుకు అధికారులు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో యూనిట్ -1లో బాయిలర్కు ఆయిల్ సప్లై చేసే పైపు లీకై ఆయిల్ కారుతోంది. అదే సమయంలో బాయిలర్ కింద వెల్డింగ్ పనులు జరుగుతుండటంతో నిప్పురవ్వలు ఆయిల్పై పడి ఒక్కసారిగా మంటలు లేచాయి. క్రమంగా యూనిట్ మొత్తం మంటలు వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ఈ ఘటనతో 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రమాద సమయంలో ఈ ప్రాంతంలో కార్మికులు పెద్దగా లేకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పింది. ట్రయల్ రన్ నిర్వహిస్తున్న సమయంలో ఇలాంటి ప్రమాదాలు జరగడం సహజమేనని అధికారులు చెప్తున్నారు. విషయం తెలుసుకున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వెంటనే పవర్ ప్లాంట్కు చేరుకొని పరిశీలించారు. అధికారులను వివరాలడిగి తెలుసుకున్నారు.
- Advertisement -