– ఆందోళన వ్యక్తం చేసిన ఐరాస సెక్రటరీ జనరల్ గుట్రేస్
– అంతర్జాతీయ చట్టాలను పాటించని ఇజ్రాయిల్
న్యూయార్క్ : గాజాలో తీవ్రమైన మానవతా సంక్షోభంపై ఐక్యరాజ్య సమితి ( ఐరాస ) సెక్రటరీ జనరల్ అంటోనియో గుట్రేస్ ఆందోళన వ్యక్తం చేశారు. సాదారణ ప్రజల మరణాలను ఆయన ఖండించారు.గత కొన్ని రోజుల్లో ఇజ్రాయెల్ సైన్యం బెదిరింపులకు భయపడి దాదాపు 30 వేల మంది ప్రజలు భద్రత లేకుండా తమ గూడు వదిలి పారిపోవాల్సి వచ్చిందని, ఆశ్రయం, ఆహారం, ఔషధాలు నీరు వంటి ప్రాథమిక అవసరాల్లేవని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆశ్రయం, ఆహారం కోసం వచ్చిన వారిపై జరిగిన దాడుల్లో వేలమంది పాలస్తీనియన్లు మరణించారు, అనేక మంది గాయపడ్డారు. గత కొన్ని రోజుల నుండి గాజాకు ఇంధన సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఇంక్యుబేటర్లు మూతపడ్డాయి, గాయపడిన వారిని, రోగులను తరలించేందుకు అంబులెన్స్లు అందుబాటులో లేని పరిస్థితి, నీటిని శుద్ధి చేయలేని దుస్థితి ఏర్పడింది. ఐరాస, ఇతర సహాయ సంస్థలు నిర్వహిస్తున్న స్వల్ప సహాయ కార్యక్రమాలు కూడా ఆగిపోయే ప్రమాదం ఉందని గుట్రేస్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మానవతా చట్టాల ప్రకారం పౌరులను గౌరవించాలి, రక్షించాలి వారి అవసరాలను తీర్చాలని గుట్రేస్ స్పష్టం చేశారు. ప్రజలకు సహాయం అందించేందుకు ఐరాస వద్ద స్పష్టమైన ప్రణాళిక ఉందని, సురక్షితంగా పెద్ద ఎత్తున సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని , ఇజ్రాయిల్తో సహా అన్ని పక్షాలు అంతర్జాతీయ చట్టాలను పాటించాలని, వెంటనే శాశ్వత కాల్పుల విరమణ ప్రకటించాలని, బందీలుగా ఉన్నవారిని షరతులు లేకుండా విడిచిపెట్టాలని మరోసారి ఆయన కోరారు.
గాజాలో తీవ్రమైన మానవతా సంక్షోభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES