– అబ్దుల్లాపూర్మెట్లోని కొహెడలో ఘటన
నవతెలంగాణ -హయత్నగర్
గొర్రెలను దొంగిలించడానికి వచ్చిన దుండగులు వాటికి కాపలాగా ఉన్న ఓ కానిస్టేబుల్, మరో వ్యక్తిపై కత్తులతో దాడి చేసి గాయపరిచారు. ఆ తర్వాత సుమారు 30 గొర్రెలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హయత్నగర్ ఇన్స్పెక్టర్ నాగరాజుగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని కొహెడ గ్రామంలో నివాసముంటున్న రాసూరి నవీన్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని కుషాయిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. అతని తండ్రి అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నాడు. దాంతో వేణుగోపాలస్వామి దేవాలయ సమీపంలోని సంపత్ బాల్రెడ్డి పొలంలో మందలో ఉంచిన సుమారు 250 గొర్రెలకు తన బావమరిది శ్రీకాంత్తో కలిసి నవీన్ ఆదివారం అర్ధరాత్రి కాపలాగా ఉన్నాడు. అయితే, సోమవారం తెల్లవారుజామున సుమారు 8 నుంచి 9 మంది గుర్తు తెలియని యువకులు వచ్చి ఇద్దరిపై కత్తులతో దాడి చేసి సుమారు 30 గొర్రెలను దొంగిలించి బొలెరోలో పరారయ్యారు. వారి సెల్ఫోన్లు, రూ.5 వేలు ఎత్తుకెళ్లారు. దాంతో బాధితులు హయత్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఔటర్రింగ్ రోడ్డుపై ఉన్న సీసీ ఫుటేజ్లను పరిశీలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వనస్థలిపురం ఏసీపీ, డాగ్ స్క్వాడ్, సీసీఎస్ పోలీసులు పరిశీలించి.. నిందితుల కోసం గాలిస్తున్నారు.
కత్తులతో దాడి చేసి 30 గొర్రెలు చోరీ
- Advertisement -