నవతెలంగాణ-హైదరాబాద్ : యూఏఈ సరికొత్త గోల్డెన్ వీసాలను ప్రకటించింది. ఇప్పటికే యూఏఈ అందిస్తున్న గోల్డెన్ వీసాలకు విశేష ఆదరణ లభిస్తుండగా, తాజాగా మరిన్ని రకాల గోల్డెన్ వీసాలను అందుబాటులోకి తెచ్చేందుకు యూఏఈ సిద్ధమైంది. ఇప్పటివరకు స్థిరాస్తుల కొనుగోలు, వ్యాపార రంగంలో భారీ పెట్టుబడులు పెట్టేవారికి గోల్డెన్ వీసాలను జారీ చేస్తుండగా, ప్రస్తుతం నామినేషన్ ఆధారిత గోల్డెన్ వీసాలను జారీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
తొలుత ఈ కొత్త రకం గోల్డెన్ వీసాల జారీని భారత్, బంగ్లాదేశ్ దేశాల పౌరులకు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీని కోసం భారత్లో రయాద్ గ్రూప్ అనే కన్సల్టెన్సీని ఎంపిక చేశారు. ఇప్పటివరకు భారత్ నుంచి దుబాయ్ గోల్డెన్ వీసా పొందేవారు స్థిరాస్తిలో కనీసం 20 లక్షల ఏఈడీ (సుమారు రూ.4.66 కోట్లు) పెట్టుబడి పెట్టేవారు లేదా వ్యాపారంలో భారీగా నిధులు ఇన్వెస్ట్ చేసేవారు.
అయితే, కొత్తగా ప్రవేశపెట్టిన నామినేషన్ ఆధారిత వీసా విధానంలో లక్ష ఏఈడీలు (దాదాపు రూ.23.30 లక్షలు) ఫీజు చెల్లించడం ద్వారా జీవితకాలం చెల్లుబాటు అయ్యే వీసాను పొందవచ్చని సంబంధిత వర్గాలు ఓ వార్తా సంస్థకు తెలిపాయి. ఈ విధానం ద్వారా మూడు నెలల్లో 5 వేల మందికి పైగా భారతీయులు దరఖాస్తు చేసుకుంటారని అంచనా వేస్తున్నారు.