– డీలర్ల వద్ద పెరుగుతున్న ఇన్వెంటరీస్
– ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్ల అసోసియేషన్ ఆందోళన
– పెరిగిన ఈవీ అమ్మకాలు
న్యూఢిల్లీ : దేశంలో కార్ల అమ్మకాలు పడిపోవడంతో పాటు ఎగుమతుల్లోనూ మందగింపుతో వాహన నిల్వలు పేరుకుపోతున్నాయి. వరుసగా పెంచిన ధరలకు తోడు, డిమాండ్ పడిపోవడంతో అమ్మకాలు లేక దేశవ్యాప్తంగా డీలర్ల వద్ద కోట్ల రూపాయల విలువైన కార్ల నిల్వలు పొగుబడుతున్నాయి. ఆటోమొబైల్ పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొనే అమ్మకాల సవాళ్ల గురించి ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్ల అసోసియేషన్ (ఫాడా) ఆందోళన వ్యక్తం చేసింది. సరఫరా పరిమితులు, అధిక ఇన్వెంటరీ స్థాయిలు రిటైల్ విక్రయాల వృద్ధికి అడ్డంకిగా మారాయని తెలిపింది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా సుంకాల నుంచి వచ్చే స్పిల్ఓవర్ ప్రభావాలు వినియోగదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. అదే సమయంలో చైనా అరుదైన లోహాల ఎగుమతి నిషేధాలు వాహన సరఫరాను మరింత ఒత్తిడికి గురి చేయవచ్చని ఎఫ్ఏడీఏ పేర్కొంది. ఈ ఏడాది మే లో విక్రయాలతో పోల్చితే జూన్లో రిటైల్ వాహన అమ్మకాలు 9.4 శాతం క్షీణించాయి. ఒక కారు షోరూంలో ఉండే సగటు సమయం, లేదా ఇన్వెంటరీ రోజులు మే నెలలో 52-53 రోజులుగా ఉండగా..
జూన్లో సుమారు 55 రోజులకు పెరిగాయి. ఇది ఎఫ్ఏడీఏ సిఫారసు చేసిన 21 రోజుల గడవు కంటే చాలా ఎక్కువ. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన హెచ్చు సుంకాలు, దేశీయంగా కఠిన ఫైనాన్సింగ్ విధానం భారతీయ కార్ల తయారీదారులకు తీవ్రమైన సవాళ్లుగా నిలిచాయని ఎఫ్ఏడీఏ పేర్కొంది. అయితే ప్రస్తుతం దేశంలో స్వల్ప కాలంలోనే సాధారణం కంటే ఎక్కువ రుతుపవనాల నమోదుతో సమీప భవిష్యతులో అమ్మకాలు పెరగొచ్చని ఆశాభావం వ్యక్తం చేసింది.