– వికారాబాద్లో బాలిక క్షేమం
– శంషాబాద్లో తల్లిదండ్రులకు చిన్నారి అప్పగింత
– కిడ్నాప్ చేసిన మహిళ అరెస్టు
నవతెలంగాణ-శంషాబాద్
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నారి కిడ్నాప్ కేసును కొద్ది గంటల్లోనే పోలీసులు ఛేదించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ కె.బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కంచన్పల్లి గ్రామానికి చెందిన క్యాత్రమోని లక్ష్మమ్మ ఈ నెల ఒకటో తేదీన తన ఇద్దరు కూతుర్లతో కలిసి శంషాబాద్లోని కల్లు కాంపౌండ్లో కల్లు తాగడానికి వచ్చింది. అక్కడికి శంషాబాద్లోని రాల్లగూడ ఇందిరానగర్ దొడ్డికి చెందిన రంగాపురం రజినీ కల్లు తాగడానికి వచ్చి.. వీరితో మాటలు కలిపింది. అనంతరం లక్ష్మమ్మ కూతురు కీర్తన(6)ను కిడ్నాప్ చేసింది. దాంతో చిన్నారి తల్లి ఈ నెల 8వ తేదీన తన కూతురు కిడ్నాప్నకు గురైందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వెంటనే అప్రమత్తమై.. సీసీకెమెరాలు పరిశీలించారు. టెక్నికల్ ఆధారాలతో కిడ్నాప్ కేసును ఛేదించారు. చిన్నారిని కిడ్నాప్ చేసిన మహిళను మంగళవారం రాత్రి వికారాబాద్లో గుర్తించి, అక్కడే పట్టుకున్నారు. ఆమె వద్ద అపహరణకు గురైన కీర్తన క్షేమంగా ఉంది. పోలీసులు పాపతోపాటు ఆమెను శంషాబాద్కు తరలించారు. పాపను బుధవారం తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితురాలిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
- Advertisement -
- Advertisement -