– ఇతర దేశాలపై 20 శాతం సుంకాలు ొ మరోసారి ట్రంప్ ఆర్థిక దాడి
వాషింగ్టన్/ ఒట్టావా : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోమారు సుంకాల దాడిని ప్రారంభించారు. వచ్చే నెలలో కెనడా నుంచి వచ్చే దిగుమతులపై 35 శాతం సుంకం విధిస్తామని, ఇతర పలు వాణిజ్య భాగస్వాములపై 15 శాతం లేదా 20 శాతం టారిఫ్లను విధించాలని యోచిస్తున్నామని ట్రంప్ తన తన సోషల్ మీడియా ప్లాట్ఫాం ట్రూత్ సోషల్లో ఓ లేఖలో పేర్కొన్నారు. కొత్త రేటు ఆగస్టు 1 నుంచి అమలులోకి వస్తుందని కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీకి స్పష్టం చేశారు. దీనిపై కెనడా ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తే ఈ రేటు మరింత పెరుగుతుందని ట్రంప్ హెచ్చరించారు. టారిఫ్లపై యూఎస్తో చర్చించడం ద్వారా తమ కార్మికులు, వ్యాపారులను కాపాడుకునే ప్రయత్నం చేస్తామని మార్క్ కార్కీ తెలిపారు. ఇప్పటి వరకు కెనడా ఉత్పత్తులపై యుఎస్ 25 శాతం సుంకాలను అమలు చేస్తోంది. దీన్ని మరో 10 శాతం పెంచి 35 శాతానికి చేర్చనుంది.
అయితే.. అమెరికా, మెక్సికో, కెనడా ఒప్పందంలో కొన్ని కవర్ చేయబడిన వస్తువులకు మినహాయింపు కొనసాగుతుందని భావిస్తున్నారు. ఇంధనం, ఎరువులపై 10 శాతం సుంకాలను యధాతథంగా కొనసాగించనుందని భావిస్తున్నారు. అయితే ఈ విషయాలపై ట్రంప్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ఒక అడ్మినిస్ట్రేషన్ అధికారి తెలిపారు. కెనడా నుంచి వస్తోన్న ఫెంటానిల్పై ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. అధిక దిగుమతుల వల్ల అమెరికా వాణిజ్య లోటు పెరుగుతుందని.. ఇది తమ ఆర్థిక వ్యవస్థ, జాతీయ భద్రతకు ముప్పుగా ఉందని పేర్కొన్నారు. 2024లో యూఎస్ సెన్సస్ బ్యూరో డేటా ప్రకారం.. కెనడా నుంచి 413 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను అమెరికాకు దిగుమతి చేసుకుంది. అమెరికా నుంచి కెనడా 349 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది.కెనడా ఫెంటానిల్ సరఫరాను ఆపివేస్తే తాము ఈ లేఖను సర్దుబాటు చేసే యోచన ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ”కెనడా ఉత్తర అమెరికాలో ఫెంటానిల్ బెడదను ఆపడానికి కీలకమైన పురోగతి సాధించింది. రెండు దేశాలలోని ప్రజలను రక్షించడానికి, సమాజాలను కాపాడడానికి యునైటెడ్ స్టేట్స్తో కలిసి పనిచేయడానికి మేము కట్టుబడి ఉన్నాము,” అని కార్నీ మంగళవారం రాత్రి తన ఎక్స్ పోస్ట్లో పేర్కొన్నారు.