– బీసీ బిల్లును కవిత హైజాక్ చేసే ప్రయత్నం చేస్తోంది
– రంగులు పూసుకుంటే ప్రజలు నమ్మరని కవిత తెలుసుకోవాలి : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
సీఎం రేవంత్ రెడ్డి బీసీ క్యాంపెనర్గా వెనకబడిన వర్గాల కోసం పని చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బీసీ బిడ్డ కాకపోయినప్పటికీ బీసీల అభ్యున్నతి కోసం సీఎం అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పారు. ఇచ్చిన మాటకు కట్టుబడి బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన కాంగ్రెస్ పక్షాన ప్రజలు, బీసీ వాదులు మద్దతుగా నిలవాలని కోరారు. అయితే… బీసీ బిల్లును కవిత హైజాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారని, వాటిని మానుకోవాలని హితవు పలికారు. జెండాలు, రంగులు మార్చినంత మాత్రానా ప్రజలు నమ్ముతారనే భ్రమపడుతున్నారని ఎద్దేవా చేశారు. శుక్రవారం నాడిక్కడ తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం… 42 శాతం బీసీల రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ కట్టుబడి ఆర్డినెన్స్ తెచ్చిందనీ, ఆ రోజ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందని అన్నారు.
ఇది కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధికి నిదర్శమన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపించామని గుర్తు చేశారు. కానీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లను 21 శాతం తగ్గించిన పార్టీ బీఆర్ఎస్ అని విమర్శించారు. ఇప్పుడు ఆ విషయాన్ని మరిచి కవిత హడావుడి చేస్తోందని విమర్శించారు. ‘కవితకు బీసీ బిల్లుతో సంబంధం ఏంటి ? బీసీ బిల్లును సైతం కవిత హైజాక్ చేస్తుంది.. కవిత పాత్ర ఏంటి ?. కవిత బీసీలపై మొసలి కన్నీరు కార్చడం మానుకోవాలి. లేని రంగులు పూసుకుంటే ప్రజలు నమ్ముతారనేది వారి భ్రమ’ అని చెప్పారు. కవిత మై డియర్ డాడీ అంటూ కేసీఆర్కు రాసిన లేఖలోనూ… కేసీఆర్ పై కాంగ్రెస్ చేస్తోన్న విమర్శలనే ఎత్తి చూపారని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని, ఫాం హౌజ్ కే పరిమితమయ్యారని అన్నారు. పార్టీ సభ్యత్వానికి రాజాసింగ్ చేసిన రాజీనామాను బీజేపి అధిష్టానం ఆమోదించిన నేపథ్యంలో ఇకపై ఆయన అసెంబ్లీలో స్వతంత్య్ర అభ్యర్థిగా కొనసాగుతారా? అన్న అంశం స్పీకర్ పరిధిలోని అంశమన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి బీసీ క్యాంపెనర్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES