5773 ఎంపీటీసీ సీట్లు ఖరారు..
ఎంపీపీలు, జెడ్పీటీసీలు 566
తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వైపే రాష్ట్ర సర్కారు మొగ్గు!
ఎన్నికల సంఘం సూచన మేరకు సామాగ్రిని సిద్ధం చేసుకోవాలని ఆదేశం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్థానిక పోరుకు రాష్ట్ర సర్కారు శరవేగంగా సన్నద్ధమవుతున్నది. రాష్ట్రంలో 5, 773 ఎంపీటీసీ స్థానాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. 566 జెడ్పీటీసీ స్థానాలను, 566 ఎంపీపీ స్థానాలను, 31 జిల్లా పరిషత్లను ప్రకటించింది. ఇటీవల ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన ముసాయిదాను విడుదల చేసి వచ్చిన పలు అభ్యంతరాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని ఫైనల్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఎన్నికల సామాగ్రి(వైట్, పింక్ పేపర్లు, కవర్లు, సీల్స్, అడ్రస్ ట్యాగ్లు, స్టేషనరీ, నాన్ స్టేషనరీ వస్తువులు, తదితరాలు)ని సిద్ధం చేసుకోవాలని కలెక్టర్లు, జిల్లా పరిషత్ సీఈఓలు, జిల్లా పంచాయతీరాజ్ ఆఫీసర్లకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ డాక్టర్ జి.సృజన ఆదేశాలు జారీ చేశారు. ముందు నుంచి చెబుతున్నట్టుగానే తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే యోచనలో రాష్ట్ర సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది. ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది.
అత్యధిక స్థానాలు నల్లగొండలో..అత్యల్ప స్థానాలు ములుగులో…
మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గం (ఎంపీటీసీ), జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజ కవర్గం(జెడ్పీటీసీలు) స్థానాలు అత్యధికంగా ఉన్న జాబితాలో నల్లగొండ జిల్లా ముందు వరుసలో ఉంది. నల్లగొండ జిల్లాలో ఎంపీటీసీ స్థానాలు 353, జెడ్పీటీసీ స్థానాలు 33, ఎంపీపీలు 33 ఉన్నాయి. అత్యల్ప స్థానాలతో ములుగు జిల్లా చివరి స్థానంలో ఉంది. ఆ జిల్లాలో కేవలం 83 ఎంపీటీసీ, 10 జెడ్పీటీసీ, 10 ఎంపీపీ స్థానాలు మాత్రమే ఉన్నాయి. హైదరాబాద్తో పాటు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మొత్తం అర్బన్ ప్రాంతం ఉండటంతో అక్కడ ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలు లేకుండా పోయాయి. తక్కువ ఎంపీటీసీ స్థానాలున్న మండలాల్లో ఎంపీపీ, తక్కువ జెడ్పీటీసీలున్న జిల్లాల్లో జెడ్పీ చైర్మెన్ల ఎంపిక కత్తిమీద సాములా మారే అవకాశముంది.
