– ఆయిల్ ఫాం సాగుతో రైతుకు ఆర్థిక లాభం
– బస్వాపూర్లో ఆయిల్ ఫాం ప్లాంటేషన్ను ప్రారంభించిన మంత్రులు తుమ్మల, పొన్నం
నవతెలంగాణ-కోహెడ
ఆయిల్ ఫామ్ సాగులో హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలపాలని మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం మండలంలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన ఏనుగు రామారావు వ్యవసాయ పొలంలో 50 ఎకరాల ఆయిల్ ఫాం ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించి, ఆయిల్ ఫాం మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాలో మెగా ఫామ్ ఆయిల్ ప్లాంటేషన్లో భాగంగా 143 ప్రాంతాల్లో 23 గ్రామాలలో 674 ఎకరాల్లో ఫాం ఆయిల్ ప్లాంటేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణలో ఇప్పటి వరకు 50 వేల 455 ఎకరాలలో ఆయిల్ ఫాంను రైతులు సాగు చేస్తున్నారన్నారు.
ఆయిల్ ఫామ్ సాగులో కోతుల బెడద ఉండదు, అకాల వర్షాల ఇబ్బందులు ఉండవన్నారు. హార్టికల్చర్ అధికారుల సహకారంతో రైతులు సాగు చేయాలన్నారు. నియోజకవర్గంలో ఆయిల్ ఫాం సాగు చేయాలని 5 ఎకరాల పైన ఉన్న రైతులకు సూచిస్తున్నామన్నారు. నియోజకవర్గంలో ఒక్క గుంట భూమి కూడ వృధాగా ఉంచవద్దన్నారు. గౌరవెల్లి ప్రాజెక్ట ద్వారా ఈ ప్రాంత రైతాంగానికి నీరు ఇచ్చే బాధ్యత నాదేనన్నారు. ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసి సాగునీరు అందిస్తామన్నారు. ఆయిల్ ఫాం, డ్రాగన్ పంటలు వేసి అధిక ఆదాయాన్ని పొందాలని కోరారు. ఖమ్మం జిల్లా తర్వాత అత్యధిక ఆయిల్ ఫాం జిల్లాలోనె జరుగుతుందని తెలిపారు.
ప్రజా పాలన ప్రభుత్వంలో 12 లక్షల ఎకరాల ఆయిల్ఫాం సాగు లక్ష్యంగా ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. ఆగష్టు 15 లోపు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో నర్మేట ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభిస్తామన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్లో భాంగగా రాష్ట్ర స్థాయిలో మొత్తం 150 మున్సిపాలిటీలతో పోటీపడి 9వ ర్యాంక్, జిల్లా స్థాయిలో 1 వ ర్యాంక్ హుస్నాబాద్ మున్సిపాలిటీ సాధించిందన్నారు. అనంతరం ఆయిల్ ఫామ్ సాగు చేసిన లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫాం కార్పోరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, హార్టికల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా, జిల్లాకలెక్టర్ హైమావతి, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంద ధర్మయ్య, మార్కెట్ కమిటీ ఛైర్మన్ బోయిని నిర్మల జయరాజ్, వ్యవసాయ శాఖ అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.