నవతెలంగాణ – హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) సంచలన ఆరోపణలు చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)లో అక్రమాల వెనుక వీరి హస్తముందని ఆరోపించింది. ఈ మేరకు సీఐడీ డీజీ చారుసిన్హాకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, కార్యదర్శి గురువారెడ్డి ఫిర్యాదు చేశారు.
హెచ్సీఏ అక్రమాల్లో మరికొందరి పాత్ర ఉందని వారు ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ జరిపి జాన్ మనోజ్, విజయానంద్, పురుషోత్తం అగర్వాల్, సురేందర్ అగర్వాల్, వంకా ప్రతాప్లపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.
బీఆర్ఎస్ హయాంలో పెద్దల అండదండలతో జగన్మోహన్ రావు హెచ్సీఏ ప్రెసిడెంట్ అయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. క్రికెట్కు సంబంధం లేని రాజకీయ నేతల ప్రమేయంపై విచారణ చేయాలని సీఐడీని టీసీఏ అధికారులు కోరారు.
హెచ్సీఏ అక్రమాల వ్యవహారంపై సీఐడీతో పాటు ఈడీకి కూడా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. మనీలాండరింగ్ కోణం ఉందని విచారణ జరపాలని టీసీఏ ఫిర్యాదులో తెలిపింది. ఇప్పటికే హెచ్సీఏ అక్రమాలపై పూర్తి వివరాలు అందజేయాలని సీఐడీనీ ఈడీ కోరింది.