నాల్గో టెస్టులో ఆడేది అనుమానమే
టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీ
నవతెలంగాణ-లండన్
భారత పేస్ దళపతి జశ్ప్రీత్ బుమ్రా మాంచెస్టర్లో టెస్టు మ్యాచ్ ఆడలేదు. కానీ ఇప్పుడు మాంచెస్టర్ టెస్టులో భారత్కు బుమ్రా అవసరం ఏర్పడింది. ఐదు టెస్టుల ‘టెండూల్కర్-అండర్సన్’ ట్రోఫీలో భారత్ 1-2తో వెనుకంజలో కొనసాగుతుంది. టెస్టు సవాల్ రసవత్తరంగా మారిన తరుణంలో జశ్ప్రీత్ బుమ్రాను నాల్గో టెస్టులో బరిలో దింపాలా? పని భారం దృష్టిలో ఉంచుకుని ఐదో టెస్టు కోసం అట్టిపెట్టుకోవాలా? అనేది టీమ్ ఇండియా మేనేజ్మెంట్ తేల్చాల్సి ఉంది. భారత్, ఇంగ్లాండ్ నాల్గో టెస్టు మాంచెస్టర్లో ఈ నెల 23 నుంచి ఆరంభం కానుంది.
ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో జశ్ప్రీత్ బుమ్రా రెండింట బరిలోకి దిగాడు. లీడ్స్ టెస్టులో బుమ్రా 43.4 ఓవర్లు వేశాడు. తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. బర్మింగ్హామ్ టెస్టులో బుమ్రాకు విశ్రాంతి లభించింది. లార్డ్స్ టెస్టులో తుది జట్టులో నిలిచిన బుమ్రా ఏడు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల ప్రదర్శనతో మెప్పించాడు. లార్డ్స్లో బుమ్రా 43 ఓవర్లు సంధించాడు. బుమ్రా రెండు టెస్టుల్లోనూ టీమ్ మేనేజ్మెంట్ అతడికి సుదీర్ఘ స్పెల్స్ బౌలింగ్ ఇవ్వలేదు. లార్డ్స్ టెస్టు తర్వాత భారత్కు ఎనిమిది రోజుల విరామం లభించింది. దీంతో మాంచెస్టర్ టెస్టులో బుమ్రాను ఆడించాలనే వాదన బలంగా వినిపిస్తోంది. కెప్టెన్ శుభ్మన్ గిల్ ‘ బుమ్రా ఆడేది లేనిది త్వరలో తెలుస్తుంది’ అని వ్యాఖ్యానించగా.. స్టార్ పేసర్ను మాంచెస్టర్లో కచ్చితంగా ఆడించాలని భారత మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు.
‘ప్రతి జట్టు మేనేజ్మెంట్ ఉత్తమ ఆటగాడిని ప్రతి మ్యాచ్లో ఆడించాలని అనుకుంటుంది. బౌలర్ల విషయంలో పని భారం ఆధారంగా నిర్ణయాలు ఉంటాయి. ఎక్కువగా అలసిపోయాడా, లేదా సహా ఇతర ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అనేది చూసుకోవాలి. నాల్గో టెస్టుకు ఎనిమిది రోజుల విరామం లభించింది. అలసట సహా పని భారం నుంచి కోలుకునేందుకు ఈ సమయం సరిపోతుంది. సిరీస్ కీలక మ్యాచ్లో బుమ్రా కచ్చితంగా ఆడాలి. ఆటగాడు ఏ మ్యాచ్లో ఆడాలి? ఆడకూడదని ఎంపిక చేసుకోవటం జట్టుకు అంత మంచిది కాదు’ అని ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు.
జశ్ప్రీత్ బుమ్రా లేని వేళ బర్మింగ్హామ్లో మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్ బాధ్యత తీసుకున్నారు. మూడో పేసర్ ప్రసిద్ కృష్ణ 111 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. అయినా సిరాజ్, ఆకాశ్ మెరుపులతో ఎడ్జ్బాస్టన్లో విజయం భారత్ సొంతమైంది. తొలి రెండు టెస్టుల్లో శార్దుల్ ఠాకూర్ సైతం పేలవ ప్రదర్శన చేశాడు. సిరీస్లో ఆశలు సజీవంగా నిలవాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్లో బుమ్రాను ఆడించటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని విశ్లేషకుల అభిప్రాయం.
గిల్ సేన సాధన
భారత క్రికెటర్లు గురువారం లండన్లోని ఓ మైదానంలో ముమ్మర సాధన చేశారు. జశ్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్, శుభ్మన్ గిల్ సహా భారత క్రికెటర్లు అందరూ ప్రాక్టీస్ సెషన్లో సాధన చేశారు. ఎనిమిది రోజుల్లో బుమ్రా ఫిట్నెస్పై ఓ అంచనాకు వచ్చి ఆ తర్వాతే మాంచెస్టర్లో అతడు ఆడేది లేనిది తేల్చనున్నారు. బుమ్రాకు విశ్రాంతి లభిస్తే యువ పేసర్ అర్ష్దీప్ సింగ్కు అరంగేట్ర అవకాశం దక్కనుంది!. న