నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు ముఖ్యమైన సూచనలు చేసింది. బయటి వ్యక్తులతో కరచాలనం చేయడాన్ని తగ్గించాలని, శానిటైజర్ ఉపయోగించడం ద్వారా పరిశుభ్రత పాటించాలని కోరింది. అన్ని స్థానిక ఆసుపత్రులలో అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది.
పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దోమలు రాకుండా తలుపులు, కిటికీలకు తెరలు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. సెప్టిక్ ట్యాంకులు, ఇతర నీటి నిల్వ ప్రదేశాల్లో దోమలు వృద్ధి చెందే అవకాశం ఉన్నందున, ఆయా ప్రాంతాల్లో మెష్లను ఉపయోగించి పరిశుభ్రంగా ఉంచాలని తెలిపింది.
ప్రజలు వడపోసిన నీటిని మాత్రమే తాగాలని, భోజనానికి ముందు, తరువాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించింది. కలుషిత ఆహారం కారణంగా ఫుడ్ పాయిజన్ సంభవించే ప్రమాదం ఉన్నందున, వీలైనంత వరకు బయట ఆహార పదార్థాలు తినకూడదని హెచ్చరించింది.