– టీపీఎస్కే రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు
నవతెలంగాణ – ముషీరాబాద్
అక్షరాలతో అగ్గి రవ్వలు పుట్టించి.. చందస్సు సంకెళ్లను తెంచిన ప్రజాకవి శ్రీశ్రీ అని టీపీఎస్కే రాష్ట్ర అధ్యక్షులు భూపతి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం ప్రముఖ కవి శ్రీశ్రీ 115వ జయంతి సందర్భంగా హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టీపీఎస్కే హాల్లో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ చిత్రపటాలను చేబూని శ్రీ శ్రీ కవిత్వం వర్ధిల్లాలి అంటూ యువత ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శ్రీశీ మాట పీడిత పక్షం.. ఆయన బాట ప్రజా మార్గం.. ఆయన ఒక నిప్పు – అక్షరాల అగ్ని కణికలు.. అతడొక సాహిత్య సముద్రం.. ఆయన ఒక తరాన్నే ప్రభావితం చేసిన యుగ స్వరం విప్లవ నాదం, మహౌగ్రనాదం అని కవిత్వీకరించారు. 20వ శతాబ్దపు తొలి, చివరి అక్షరం కూడా అతనేనని చెప్పొచ్చన్నారు. ఈ ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపినవాడు శ్రీశ్రీ అని కొనియాడారు. అప్పటివరకు సమాజంలో ఉన్న దోపిడీ సిద్ధాంతాలకు ప్రత్యామ్నాయంగా ముందుకు తెచ్చిన సిద్ధాంతం కమ్యూనిజం అని అన్నారు. దాని సిద్ధాంతపు లోతులను సులభతరం చేసి దేశచరిత్రల పేరుతో అక్షరాన్ని ఆయుధం చేసి అందించిన లోక కవి, ఏకైక ప్రజాకవి అని తెలిపారు. సమసమాజ సామ్యవాద భావాజాలాన్ని తన కవిత్వంలో ఎత్తి పట్టారని, కొత్త నడక, సరికొత్త ఆలోచనలతో తిరోగమన సాహిత్యాన్ని భూమార్గం పట్టించారని చెప్పారు. సామాన్యుడి చుట్టూ ఆయన సాహిత్యం తిరిగిందని, సినీ గీతాల ద్వారా కూడా సామాన్యులకు దగ్గరైనారని, అందుకే శ్రీశ్రీ యుగకవి అయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లల బాలకష్ణ, టీపీఎస్కే హైదరాబాద్ సెంట్రల్ సిటీ కన్వీనర్ జి.నరేష్, నాయకులు విజరు కుమార్, కవి పొన్నం రాజయ్య గౌడ్, యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
అక్షరాలతో అగ్గి రవ్వలు పుట్టించిన ప్రజాకవి శ్రీ శ్రీ
- Advertisement -
RELATED ARTICLES