నవతెలంగాణ-హైదరాబాద్ : ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఇరుగుపొరుగు ఇళ్లలో నివసిస్తున్న బండి హారిక (20), గాడిపల్లి శ్రీకాంత్ (24) నిన్న ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
శ్రీకాంత్ డిగ్రీ పూర్తి చేసి ఆటో ట్రాలీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. హారిక పదో తరగతి పూర్తయిన తర్వాత చదువు మానేసి వ్యవసాయ కూలీ పనులకు వెళ్తోంది. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని సమాచారం.
అయితే, వారి కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్ళికి అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హారిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిన్న ఉరి వేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న శ్రీకాంత్ కూడా పొలం వద్దకు వెళ్లి చెట్టుకు ఉరి వేసుకున్నాడు.
ప్రేమించుకున్న యువతీ యువకులు బలవన్మరణానికి పాల్పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు గ్రామానికి చేరుకుని ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.