నవతెలంగాణ – హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలంలోని ఖైతాపురం వద్ద హైవేపై స్కార్పియో కారు ఓ లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న నలుగురిలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాదాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన వారిని ఏపీకి చెందిన డీఎస్పీలు మేక చక్రధర్ రావు, కాంతారావుగా గుర్తించారు.
ఏపీ ఇంటెలిజెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్లో వారు పనిచేస్తున్నారని తెలిపారు. ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం డివైడర్ను ఢీకొట్టి అవతలి వైపునకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో విజయవాడ వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.