నవతెలంగాణ – హైదరాబాద్ : ఆగష్టు 1వ తేదీ నుంచి యూపీఐ యూజర్లకు కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ క్రమంలో.. పదే పదే బ్యాలెన్స్ చెక్ చేసుకునేవారిని చెక్ పెట్టే నిబంధనలు ప్రధానంగా తీసుకొచ్చింది. పొందాయి.
వచ్చే నెల నుండి, యూపీఐ వాడేవారు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆగస్ట్ 1 తర్వాత రోజుకు ఒకే యూపీఐ యాప్ నుండి 50 సార్లు మాత్రమే మీ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోగలరు. మీరు వేర్వేరు యాప్లు వాడుతుంటే, ప్రతి యాప్లోనూ రోజుకు 50 సార్లు చెక్ చేసుకోవచ్చు. మీ ఫోన్ నంబర్కు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లను మీరు రోజుకు 25 సార్లు మాత్రమే చూడగలుగుతారు. ఈ లిమిట్స్ ఎందుకు పెడుతున్నారంటే చాలా మంది అనవసరంగా బ్యాలెన్స్ చెక్ చేయడం లేదా పేమెంట్ స్టేటస్ను పదేపదే చూసుకోవడం వల్ల సిస్టమ్పై లోడ్ పెరుగుతుంది. దీనివల్ల అప్పుడప్పుడు యూపీఐ నిలిచిపోతుంది. ఈ కొత్త రూల్స్ ఆ లోడ్ను తగ్గిస్తాయి.
అలాగే యూపీఐ ఆటోపే ఫీచర్లో కొన్ని మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు మీ ఆటోమేటిక్ పేమెంట్లు (నెలవారీ బిల్లులు, సబ్స్క్రిప్షన్లు, EMIలు) రోజంతా ఏ సమయంలో పడితే ఆ సమయంలో కాకుండా, నిర్దిష్ట సమయాల్లో మాత్రమే ప్రాసెస్ అవుతాయి. ఇది మీకు కనిపించని మార్పు అయినా, సిస్టమ్ రద్దీని తగ్గించి, సాధారణ సమయాల్లో పేమెంట్లు మరింత ఫాస్టుగా జరిగేలా చేస్తుంది. పీక్ అవర్స్ అంటే ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 5 నుండి రాత్రి 9:30 వరకు ఆటోపే ట్రాన్సాక్షన్లు అమలు కావు. ఈ కొత్త రూల్స్ అందరి యూపీఐ వాడేవారికి వర్తిస్తాయి.
ఒకసారి పంపే గరిష్ట యూపీఐ పేమెంట్ లిమిట్ లో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఇదివరకటి లాగే, చాలా సందర్భాలలో ఒక ట్రాన్సాక్షన్కు రూ. లక్ష వరకు పంపవచ్చు. కొన్ని ప్రత్యేక విభాగాలకు, అంటే హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, క్యాపిటల్ మార్కెట్స్, IPO అప్లికేషన్లు వంటి వాటికి రూ. 5 లక్షల వరకు పంపవచ్చు. బ్యాంకుల వారీగా, కొన్ని యాప్ల వారీగా రోజుకు చేసే మొత్తం ట్రాన్సాక్షన్ల సంఖ్యపై కూడా లిమిట్స్ ఉంటాయి.