Tuesday, July 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలునిషేధిత జాబితా నుంచి భూములు తొలగించాలి

నిషేధిత జాబితా నుంచి భూములు తొలగించాలి

- Advertisement -

– కోర్టు ఆర్డర్‌ను అమలు చేయాలి : ఎమ్మెల్యే ఇంటి ఎదుట ఫార్మా రైతుల నిరసన
– ప్లకార్డులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
– రైతు కమిషన్‌ చైర్మెన్‌పై రైతుల ఆగ్రహం
– పరిష్కారం చూపుతామని మల్‌రెడ్డి హామీ
నవతెలంగాణ-యాచారం

నిషేధిత జాబితా నుంచి తమ భూములు తొలగించాలని, హైకోర్టు ఆర్డర్‌ను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌లెడ్డి రంగారెడ్డి ఇంటి ఎదుట ఫార్మా బాధిత రైతులు నిరసన తెలిపారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్‌ నగర్‌, తాడిపర్తి, కుర్మిద్ధ గ్రామాలకు చెందిన దాదాపు 300 మంది ఫార్మా బాధిత రైతులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ గెలవక ముందుకు ఒక మాట.. గెలిచిన తర్వాత మాట మార్చిందని ఆరోపించారు. ఫార్మా సిటీ నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసిందని, ప్రకటించిన అవార్డును క్యాన్సిల్‌ చేసిందని అన్నారు. దాదాపు 2,700 ఎకరాల పట్టా భూములను గత ప్రభుత్వం ఫార్మాసిటీకి ఇవ్వలేదన్న నెపంతో నిషేధిత జాబితాలో పెట్టిందని తెలిపారు. అదే తరహాలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్నేండ్లుగా ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా, రైతుబీమా, క్రాప్‌ లోన్లు తమకు వర్తించడం లేదన్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించి తమకు న్యాయం చేయాలని, లేదంటే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడి స్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. సమస్యకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. రైతుల ఇబ్బందులను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకె ళ్తానని తెలిపారు. కలెక్టర్‌, ఆర్డీవోలతో మాట్లాడి పది రోజుల్లో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దాంతో రైతులు ఎమ్మెల్యే ఇంటి నుంచి వెనుదిరిగారు.
రాష్ట్ర రైతు కమిషన్‌ చైర్మెన్‌ కోదండరెడ్డిపై ఆగ్రహం
ఎమ్మెల్యే ఇంటి ఎదుట నిరసన తెలిపిన రైతులు రాష్ట్ర రైతు కమిషన్‌ చైర్మెన్‌ ముదిరెడ్డి కోదండరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యకు ప్రధాన కారణం ఆయనేనని రైతులు ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఫార్మా రైతులకు మద్దతు తెలిపిన కోదండ రెడ్డి.. పదవి రాగానే తమను మర్చిపో యారని అన్నారు. ఫార్మా రైతులను నమ్మించి మోసం చేశారని బాధిత రైతు పంగ అనసూయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ఫార్మా రైతుల ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని ఆయన పదవి పొందారని విమర్శిం చారు. ఇప్పటికైనా ఆయన తమ పక్షాన నిలబడి సమస్యను పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయా లని రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు కానమోని గణేష్‌, కుందారపు నారాయణ, పంగ అనసూయమ్మ, కొండల్‌రెడ్డి, వినోద్‌, యుగేందర్‌రెడ్డి, గోదాస్‌ నరసింహ, సందీప్‌రెడ్డి, నాలుగు గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -