Tuesday, July 29, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగంజాయి, డ్రగ్స్‌ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలి

గంజాయి, డ్రగ్స్‌ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలి

- Advertisement -

– యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి : డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్‌
– కొనసాగుతున్న యువ చైతన్య సైకిల్‌ యాత్ర
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి

గంజాయి, డ్రగ్స్‌ నిర్మూలనకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్‌ అన్నారు. గంజాయి, డ్రగ్స్‌ను నిర్మూలించాలని, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్స్‌ ను నిషేధించాలని, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని డీవైఎఫ్‌ఐ నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన యువ చైతన్య సైకిల్‌ యాత్ర సోమవారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. అంబేద్కర్‌, మహాత్మాజ్యోతిరావు పూలే విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల, కాకతీయ డిగ్రీ కళాశాల దగ్గర జరిగిన సభల్లో వెంకటేష్‌ మాట్లాడారు. అనేకమంది విద్యార్థులు, యువత గంజాయికి, డ్రగ్స్‌కు బానిసలుగా మారి బంగారం లాంటి భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు దూరమై కుటుంబాలకు భారమవుతు న్నారన్నారు. దేశ భవిష్యత్‌, అభివృద్ధి యువతపై ఆధారపడి ఉందన్నారు. దేశం వివిధ రంగాల్లో రాణించాలంటే యువత మేధస్సు, నైపుణ్యం అవసర మన్నారు. మార్పు రావాల్సింది యువతలో, మార్పు తేవాల్సింది కూడా యువతే అని చెప్పారు. దురదృష్ట వశాత్తు నేడు యువత తమ కర్తవ్యాన్ని విస్మరించి మత్తుకు బానిసలుగా మారి జ్ఞానాన్ని, విచక్షణను, శక్తి సామర్థ్యాలను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ప్రకటించినా.. ప్రచారం చేస్తున్నా డ్రగ్స్‌ వినియోగం తగ్గడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం కఠిన చట్టాలు అమలు చేయాలని, ప్రజా చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్స్‌ను ప్రభుత్వాలు పూర్తిగా నిషేధించి యువత ప్రాణాలను కాపాడాలన్నారు.
జిల్లాలో అనేక పరిశ్రమలు ఉన్నా స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదన్నారు. నిరుద్యోగ యువతకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.రవినాయక్‌, మల్లం మహేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్‌, ఖమ్మంపాటి శంకర్‌, యాత్ర సభ్యులు పుల్లెంల శ్రీకర్‌, గుండాల నరేష్‌, కట్ట లింగస్వామి, వడ్డగాని మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -