మాజీ మంత్రి జి.జగదీశ్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాళేశ్వరం కమిషన్ విచారణలో మాజీ సీఎం కేసీఆర్ కడిగిన ముత్యంలా బయటకొచ్చి తెల్లని మల్లెపూవులా పరిమళిస్తారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జి.జగదీశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాళేశ్వరంతో తెలంగాణను వ్యవసాయ రంగంలో భారతదేశంలోనే కేసీఆర్ నెంబర్ వన్గా నిలిపారని తెలిపారు. కేంద్రం నిధులు ఇస్తున్నా పోలవరాన్ని నాలుగు దశాబ్దాలైనా పూర్తి చేయలేదనీ, అలాంటిది కాళేశ్వరాన్ని కేసీఆర్ నాలుగేళ్లలో పూర్తి చేశారని చెప్పారు. 500 సంవత్సరాల్లో ఎప్పుడూ రాని వరద దాదాపు 38 లక్షల క్యూసెక్కులు రావడంతో రెండు పిల్లర్లు కుంగితే పీఎం మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, సీఎం రేవంత్ రెడ్డి దుర్మార్గమైన దాడి చేస్తున్నారని విమర్శించారు. సీల్డ్ కవర్లో వచ్చిన కమిషన్ నివేదికపై తప్పుడు ప్రచారం చేయడం తగదని హితవు పలికారు. కేవలం సీఎంఓ కార్యాలయం లీకులే తప్ప అందులో వాస్తవం లేదని కొట్టిపారేశారు. 50 సార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి 50 పైసలు తేలేదనీ, రూ.50 వేల కోట్ల మూటలు మోసుకెళ్లారని విమర్శించారు. ఈ విషయాన్ని గతంలో పీఎం మోడీ చెప్పారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఎరువుల కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాను, అశోక్నగర్ను చూస్తే సీఎం రేవంత్ రెడ్డికి భయమేస్తున్నదని ఎద్దేవా చేశారు.
టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్కు బనకచర్ల గురించి ఏమీ తెలియదన్నారు. మీనాక్షి నటరాజన్ పాదయాత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి, పీసీసీ అవమానకరమన్నారు. ఆమె పాదయాత్ర ద్వారా మంత్రులు పని చేయడం లేదని చెబుతున్నట్టే కదా అని అన్నారు. కేసీఆర్ను, బీఆర్ఎస్ను అప్రతిష్టపాలు చేసే ఆధారాలు లేని వార్తలు రాయొద్దని ఆయన మీడియాను కోరారు. సీఎంఓ నుంచి వచ్చే వార్తలే నిజమవుతాయా? అని ప్రశ్నించారు. సీల్డ్ కవర లో వచ్చిన నివేదిక ఎలా లీక్ అవుతుందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు ఎన్.భాస్కర్ రావు, రవీంద్ర కుమార్, బీఆర్ఎస్ నేతలు చింతల వెంకటేశ్వర్ రెడ్డి , గూడూరి ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.
కాళేశ్వరం కమిషన్ విచారణలో కడిగిన ముత్యం కేసీఆర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES