Wednesday, August 6, 2025
E-PAPER
Homeజాతీయంట్రంప్‌ సుంకాల బెదిరింపులపై మోడీ మౌనం దేనికి సంకేతం?

ట్రంప్‌ సుంకాల బెదిరింపులపై మోడీ మౌనం దేనికి సంకేతం?

- Advertisement -

– ఆయన వ్యాఖ్యలు దేశ సార్వభౌమ స్వభావాన్ని అవమానించడమే
– పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేతల నిలదీత
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సుంకాల బెదిరింపులపై ప్రధాని మోడీ మౌనం దేనికి సంకేతం ఇస్తుందని ప్రతిపక్ష నేతలు నిలదీశారు. మంగళవారం పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేతలు మాట్లాడుతూ ట్రంప్‌ పదేపదే చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ఎంపీ జైరాం రమేష్‌ మాట్లాడుతూ రష్యా చమురు కొనుగోళ్ల విషయంలో ఇండియాపై సుంకాలను గణనీయంగా పెంచుతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ప్రకటనపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ”ట్రంప్‌, తన మధ్య ప్రత్యేక బంధం ఉందని చాలా సంవత్సరాలుగా ప్రధాని చెబుతున్నారు. ఈ స్నేహం చాలా ఖరీదైనదని నిరూపించబడింది. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికాతో మన సంబంధాలు క్షీణించాయని స్పష్టంగా తెలుస్తుంది” అని అన్నారు.


సీపీఐ(ఎం) ఎంపీ జాన్‌ బ్రిట్టాస్‌ మాట్లాడుతూ భారత్‌పై సుంకాలను గణనీయంగా పెంచుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన ప్రకటన బాధ్యతా రాహిత్యమైనదని అన్నారు. ”కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో డొనాల్డ్‌ ట్రంప్‌ వాదనలను తిప్పికొడుతున్నారని అంటున్నారు. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు పెద్ద ఎత్తున ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి. అమెరికా, పాశ్చాత్య దేశాల నుండి చమురు తీసుకుంటున్నారని సమాచారం ఉంది. కాబట్టి, వారు బయటకు అమెరికా దాడిని ప్రతిఘటిస్తున్నట్టు చూపిస్తున్నారు. కానీ ఈ చర్యలో వారు రష్యా నుండి దూరమై, అమెరికా, దాని మిత్రదేశాల నుండి పెద్ద ఎత్తున చమురు కొనుగోలు చేస్తున్నారు. ఇది దురదృష్టకరం” అని అన్నారు. అలాగే ”కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ అధికారంలోకి నిరంతరం చొరబడి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇది ప్రజల జీవితాలను, జీవనోపాధిని ప్రభావితం చేస్తుంది. మొదటిది ఆఫ్‌షోర్‌ మైనింగ్‌. రెండవది ఆఫ్‌షోర్‌ అణు ఖనిజాల మైనింగ్‌. కాబట్టి, కేంద్ర ప్రభుతం ఈ విషయాల్లో తుది నిర్ణయం తీసుకునే ముందు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించాలి” అని అన్నారు.

శివసేన (యుబిటి) ఎంపీ ప్రియాంక చతుర్వేది మాట్లాడుతూ ”రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంతో ఉక్రెయిన్‌తో యుద్ధానికి మేము మద్దతు ఇస్తున్నామని ట్రంప్‌ చేసిన ఆరోపణలు పూర్తిగా తప్పు. అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ రష్యాతో వాణిజ్యం కొనసాగుతోంది. కాబట్టి ఇండియాపై మాత్రమే నిందలు వేయడం ఎలా న్యాయమైనది? ఇప్పుడు మనం అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై కూడా సుంకాలు విధించాలి. సుంకాలు వన్‌-వే ట్రాఫిక్‌ కాదు. మనం వాటిని సుంకాలతో కూడా కొట్టవచ్చు” అని అన్నారు. ఆర్‌ఎస్‌పి ఎంపీ ఎన్‌కె ప్రేమ్‌ చంద్రన్‌ మాట్లాడుతూ ”అమెరికా అధ్యక్షుడు అసమంజసమైన వాదనలు చేస్తున్నారు. ఇది మనదేశ సార్వభౌమ స్వభావాన్ని అవమానించినట్టుగా కనిపిస్తోంది. అమెరికన్‌ అధ్యక్షుడు ఇదంతా ఎలా చెప్పగలరు? ఆయన సుంకాల యుద్ధం ఆధారంగా మొత్తం ప్రపంచాన్ని నిర్దేశిస్తున్నారు. మనం అమెరికాకు లేదా మరే ఇతర దేశానికి లోబడి లేమని చెప్పాల్సిన అవసరం ఉంది. మనకు అందరూ సమాన భాగస్వాములు. అటువంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా స్పందించాలి. ట్రంప్‌ వ్యాఖ్యలన్నీ దేశ సార్వభౌమ స్వభావాన్ని అవమానించడం” అని పేర్కొన్నారు.సీపీఐ ఎంపీ పి. సంతోష్‌ కుమార్‌ మాట్లాడుతూ ”ట్రంప్‌ అనవసరంగా జోక్యం చేసుకుని పహల్గాం, కాల్పుల విరమణపై ప్రకటన చేసినప్పుడు ప్రభుత్వం సరిగ్గా స్పందించ లేదు. ప్రధానమంత్రికి సోషల్‌ మీడియాలో అతిపెద్ద అనుచరులు ఉన్నారు. అయినప్పటికీ ట్రంప్‌నకు వ్యతిరేకంగా ఒక్క పోస్ట్‌ కూడా పెట్టలేదు. ఇది ఇలాగే కొనసాగుతుంది. ట్రంప్‌ పరిపాలన ఇండియాను నిరంతరం అవమానిస్తోంది” అని అన్నారు. శివసేన (యుబిటి) ఎంపీ సంజరు రౌత్‌ మాట్లాడుతూ ”ట్రంప్‌ ఇండియాని పదే పదే బెదిరిస్తున్నారు. కానీ మన ప్రధాని, ప్రభుత్వం దీనిపై ఒక్క మాట కూడా మాట్లాడేందుకు సిద్ధంగా లేరు. ఇండియాపై ఒత్తిడి తీసుకురావడానికి ట్రంప్‌ ఎవరు? ఇంతకు ముందు ఏ రష్యన్‌ లేదా అమెరికన్‌ అధ్యక్షుడు కూడా ఇండియా గురించి ఇలా మాట్లాడలేదు” అని అన్నారు.

నిజమైన భారతీయులెవరో చెప్పేది జడ్జిలు కాదు: ప్రియాంక గాంధీ
తనకు న్యాయ వ్యవస్థ పట్ల పూర్తి గౌరవం ఉందని, కానీ నిజమైన భారతీయుడిని తేల్చేది జడ్జీలు కాదని ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. రాహుల్‌ గాంధీ సైన్యాన్ని, సైనికులను ఎల్లప్పుడూ గౌరవించారని ఆమె పేర్కొన్నారు. మంగళవారం పార్లమెంట్‌ ఆవరణలో మీడియాతో ఆమె మాట్లాడుతూ దేశ సరిహద్దుల భద్రతపై వ్యాఖ్యల విషయంలో రాహుల్‌గాంధీని సుప్రీంకోర్టు మందలించగా ఆమె రాహుల్‌ గాంధీనే సమర్థించారు. ప్రశ్నలు వేయడం, ప్రభుత్వాన్ని నిలదీయడం ప్రతిపక్ష నేత విధి అని, రాహుల్‌ గాంధీ చేసేది అదేనని ఆమె అన్నారు. ప్రభుత్వానికి అది ఇష్టం లేదని, వారు ఆయనకు సమాధానం చెప్పడానికి ఇష్టపడటం లేదని పేర్కొన్నారు. అందుకే వారు ఈ వ్యూహాలన్నింటినీ ఆశ్రయిస్తారని విమర్శించారు. ”పార్లమెంటును నడపడం ఎంత కష్టం? పార్లమెంటును కూడా నడపలేనంత బలహీనంగా మారారా? మొత్తం ప్రతిపక్షాలు డిమాండ్‌ చేసే ఒకే అంశంపై వారు ఎందుకు చర్చలు జరపలేరు? అని ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -