నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇండియాపై 50 శాతం సుంకాలను విధించడాన్ని వామపక్ష ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. ట్రంప్ టారిఫ్కు వ్యతిరేకంగా శుక్రవారం పార్లమెంట్ ఆవరణలో సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐఎంఎల్ పార్టీల ఎంపీలు ఆందోళన చేపట్టారు. అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు హౌరెత్తించారు. ఈ ఆందోళనలో సీపీఐ(ఎం) ఎంపీలు అమ్రారామ్, కె. రాధాకృష్ణన్, జాన్ బ్రిట్టాస్, ఎ.ఎ. రహీమ్, ఆర్. సచ్చిదానందం, సీపీఐ ఎంపీలు పి.పి. సునీర్, వి. సెల్వరాజ్, పి. సంతోష్ కుమార్, సీపీఐఎంఎల్ ఎంపీలు సుధామ ప్రసాద్, రాజా రామ్ పాల్గొన్నారు. దీనికి సంబంధించి పార్లమెంట్ ఉభయ సభల్లో వామపక్ష ఎంపీలు వాయిదా తీర్మానాలు ఇచ్చారు. అలాగే దేశంలో క్రైస్తవులు, మైనార్టీలపై దాడులను తీవ్రంగా వ్యతిరేకించారు. ఛత్తీస్గఢ్లో క్రైస్తవ నన్స్ అరెస్టు తరువాత ఒడిశాలో భజరంగ్ దళ్ నేతృత్వంలోని క్రైస్తవ వేటను వ్యతిరేకిస్తూ వామపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. పూజారులు, సన్యాసినులపై దాడులను ఖండించారు. ఉత్తర భారత రాష్ట్రాల్లో క్రైస్తవులపై వ్యవస్థీకృత దాడులు జరుగుతున్నాయని జాన్ బ్రిట్టాస్, వి. శివదాసన్, ఎ.ఎ. రహీమ్ తెలిపారు. ఛత్తీస్గఢ్లో జరిగిన సంఘటన ఒడిశాలో కూడా పునరావృతమైందన్నారు. కేరళకు చెందిన కేంద్ర మంత్రులు ఈ అంశంపై నోరు విప్పడం లేదని, సురేష్ గోపి, జార్జ్ కురియన్ క్రైస్తవ మైనారిటీని ఉపయోగించి మంత్రి పదవులను పొందారని విమర్శించారు. ఎంపీలు తమ మౌనాన్ని విడనాడి తమ వైఖరిని స్పష్టం చేయాలని, వామపక్ష పార్టీలు పార్లమెంటు లోపల, వెలుపల తీవ్రంగా నిరసన కొనసాగిస్తాయని అన్నారు.