Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంచిన్న పరిశ్రమలకు శరాఘాతం

చిన్న పరిశ్రమలకు శరాఘాతం

- Advertisement -

– భవిష్యత్‌కు గడ్డుకాలమే
– ప్రమాదంలో లక్షలాది ఉద్యోగాలు
– ట్రంప్‌ టారిఫ్‌లతో కలవరం
– సగానికిపైగా ఉత్పత్తులపై 50 శాతం భారం
నవతెలంగాణ – బిజినెస్‌ డెస్క్‌
: భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ విధించిన అధిక సుంకాలు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)లకు శరఘాతంగా మారాయి. యూఎస్‌ విధించిన 50 శాతం భారీ సుంకాలతో ఎంఎస్‌ఎంఈ ఎగుమతి దారులు తీవ్ర ఆందోళనకు గురవుతోన్నారు. ఇప్పటికే వేసిన సుంకానికి మరో 25 శాతం పెంచడంతో మొత్తం 50 శాతానికి చేరిన విషయం తెలిసిందే. ట్రంప్‌ చర్యలు అత్యంత షాకింగ్‌గా ఉన్నాయని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్స్‌ (ఎఫ్‌ఐఈఓ) పేర్కొంది. ”ట్రంప్‌ చర్యలు భారత ఎగుమతులకు తీవ్రమైన ఎదురుదెబ్బ. యూఎస్‌ మార్కెట్‌కు వెళ్తున్న మన ఎగుమతులలో దాదాపు 55 శాతం నేరుగా ప్రభావితమవుతాయి. ఎగుమతిదారులపై ఖర్చు భారం పెరగనుంది. దీనివల్ల తక్కువ సుంకాలను ఎదుర్కొనే దేశాల ఎగుమతిదారులతో పోలిస్తే మన ఎగుమతిదారులు 30-35 శాతం పోటీతత్వ నష్టాన్ని చవి చూడాల్సి ఉంటుంది’ అని ఎఫ్‌ఐఈఓ డైరెక్టర్‌ జనరల్‌ అజరు సహారు తెలిపారు. అధిక టారిఫ్‌లు ముఖ్యంగా టెక్స్‌టైల్స్‌, మెరైన్‌ ఉత్పత్తులు (రొయ్యలు), లెదర్‌ రంగాలను తీవ్రంగా దెబ్బతీయనున్నాయి. ఆగస్టు 7 నుంచే తొలి దశ 25 శాతం సుంకాలు అమల్లోకి రావడంతో ఇప్పటికే అనేక ఆర్డర్లు నిలిచిపోయాయని పారిశ్రామిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ కొత్త సుంకాలతో భారతీయ వస్తువులు అమెరికాలో అత్యధిక దిగుమతి సుంకం రేటును ఎదుర్కొంటున్నాయి. ఇది బ్రెజిల్‌తో సమానంగా ఉంది. ”ఎంఎస్‌ఎంఈలు నడిపే అనేక రంగాలకు ఈ ఆకస్మిక వ్యయాలు, టారీఫ్‌ల పెరుగుదలను భరించడం సాధ్యం కాదు. లాభాలు ఇప్పటికే తక్కువగా ఉన్నాయి. ఈ అదనపు దెబ్బ వల్ల ఎగుమతిదారులు దీర్ఘకాల క్లయింట్‌లను కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ అధిక సుంకాలతో దేశీయ ఎగుమతిదారులు ప్రత్యామ్నాయ మార్కెట్‌లను వెతుక్కోవాల్సి ఉంటుంది.” అని అజరు సహారు పేర్కొన్నారు. యూఎస్‌ సుంకాలు సుమారు 47.6 బిలియన్‌ డాలర్ల విలువైన ఎగుమతులను నేరుగా ప్రభావితం చేస్తాయి. ఇది భారతదేశ ఎగుమతులలో 55 శాతానికి సమానం. అందులోనూ ఎంఎస్‌ఎంఈలపై అధిక ప్రభావం ఉండనుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రమాదంలో జీవనోపాధి
అధిక టారిఫ్‌లు టెక్స్‌టైల్స్‌, మెరైన్‌ ఉత్పత్తులు, లెదర్‌ రంగాల్లోని లక్షలాది మంది ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపనుందని ఆ పరిశ్రమ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. టెక్స్‌టైల్‌ తయారీలో 40 లక్షల మంది, దుస్తుల ఉత్పత్తిలో 1.11 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారని అంచనా. ఈ సుంకాల వల్ల ఆర్డర్లు నిలిచిపోవడానికి తోడు టారిఫ్‌లు పెరగడం వల్ల ఎంఎస్‌ఎంఈలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటాయి. గత ఆర్థిక సంవత్సరం 2024-25లో 5.3 బిలియన్‌ డాలర్ల వస్త్రాలు, తోలు, పాదరక్షలకు సంబంధించి 1 బిలియన్‌ డాలర్ల విలువ చేసే ఎగుమతులు జరిగాయి. ఆయా రంగాల్లో యూఎస్‌ చర్యలతో భారత్‌లోని లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుంకా లు తగ్గకపోతే భారీగా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఎఫ్‌ఐఈఓ కు చెందిన ఓ ప్రతినిధి పేర్కొన్నారు. ”అధిక సుంకాలు టెక్స్‌టైల్‌, దుస్తుల ఎగుమతిదారులకు భారీ ఎదురుదెబ్బ. అదే విధంగా వియత్నాం, బంగ్లాదేశ్‌లతో పోటీపడే సామర్థ్యాన్ని భారీగా బలహీనపర్చనుంది.” అని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ టెక్స్‌టైల్‌ ఇండిస్టీ (సీఐటీఐ) చైర్మెన్‌ రాకేశ్‌ మెహ్రా పేర్కొన్నారు. దీనిపై తక్షణ ప్రభుత్వ జోక్యం అవసరమని అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img