సోమ మల్లారెడ్డి..సీపీఐ(ఎం) మండల కార్యదర్శి
నవతెలంగాణ – గోవిందరావుపేట : పత్రికా స్వేచ్ఛను పాలకులేహరించి వేస్తున్నారని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పసర సీపీఐ(ఎం) కార్యాలయంలో పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా గ్రామ కమిటీ అధ్యక్షుడు కడారి నాగరాజు అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మల్లారెడ్డి హాజరై మాట్లాడారు. ప్రపంచంలో భారతదేశం పత్రిక స్వేచ్ఛ సర్వేలో 151వ స్థానానికి పరిమితమైందని అన్నారు. సమీపదేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్ ల కంటే వెనుకబడి ఉండడం సిగ్గుచేటని అన్నారు. ప్రశ్నించే గొంతుకను నొక్కుతూ నియంత పాలన కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. బిజెపి కాంగ్రెస్ ప్రభుత్వాలు తమ రాజ్యాధికారం కోసం పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారని పలు సందర్భాల్లో తేటతెల్లం అయిందని అన్నారు. ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం, జైలకు పంపడం, అనగదొక్కడం వంటి కార్యక్రమాలకు పూనుకుంటూ చరిత్ర హీనులుగా మిగిలిపోతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు తమ స్థానాన్ని గుర్తించి పత్రికా స్వేచ్ఛను ప్రోత్సహించాలని తాము కోరుతున్నామని అన్నారు. పత్రికా స్వేచ్ఛను అడ్డుకోవడం వల్ల పరిపాలన కుంటుపడుతుందని ప్రజలకు సక్రమమైన పరిపాలన అందదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు పత్రిక స్వేచ్ఛను ప్రోత్సహించాలని మరోమార కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులతో పాటు పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు.
పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న పాలకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES