నవతెలంగాణ – హైదరాబాద్ : దక్షిణ యూరప్లో కార్చిచ్చు మరింత తీవ్రమైంది. ఈ కార్చిచ్చులతో స్పెయిన్, టర్కీ, అల్బేనియాల్లో ముగ్గురు మరణించినట్లు అధికారులు బుధవారం తెలిపారు. గ్రీస్లోని మూడవ అతిపెద్ద నగరం పాట్రాస్ను మంటలు చుట్టుముట్టకుండా అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు. పాట్రాస్ వెలుపల, ఆలివ్ తోటల్లోకి మంటలు వ్యాపించాయి. ఇళ్లు, వ్యవసాయ సదుపాయాలను రక్షించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. హెలికాప్టర్లు, విమానాలతో మంటలపై నీటిని జల్లుతున్నారు. నరికివేసిన కొమ్మల మంటలను నివాసితులు బకెట్లతో నీటితో ఆర్పేందుకు యత్నిస్తున్నారు.
గత కొన్ని రోజులుగా మధ్యధరా ఐరోపా అంతటా వేడిగాలులు, అధిక ఉష్ణోగ్రతలతో ఈ ప్రాంతాల్లో అగ్నిమాపక యంత్రాలు తగ్గాయి. పశ్చిమ గ్రీకులోని పాట్రాస్ మరియు జాకింథోస్ ద్వీపంలో డజన్ల కొద్దీ చెలరేగిన కార్చిచ్చులపై విమానాలతో నీళ్లను స్ప్రే చేస్తున్నారు. ఏథేన్స్ పొరుగున ఉన్న అల్బేనియాకు కూడా అగ్నిమాపక యంత్రాలను పంపినట్లు అధికారులు తెలిపారు. రాజధాని టిరానాకు దక్షిణాన జరిగిన అగ్ని ప్రమాదంలో 80 ఏళ్ల వృద్ధుడు మరణించాడని అన్నారు. మధ్య అల్బేనియాలో ఆర్మీకి చెందిన మందుగుండు సామాగ్రి డిపో సమపంలోని నాలుగు గ్రామాలను ముందు జాగ్రత్తగా ఖాళీ చేయించారు.
మాడ్రిడ్కు ఉత్తరాన ఉన్న కాస్టిల్ మరియు లియోన్ ప్రాంతం నుండి వేలాది మందిని తరలించారు. ఈ ప్రాంతంలో అగ్నిమాపక దళానికి చెందిన స్వచ్ఛంద సేవకుడు ఒకరు మరణించాడు. దక్షిణ టర్కీలో కార్చిచ్చును అదుపు చేసేందుకు యత్నిస్తుండగా అగ్నిమాపక వాహనం ఢ కొనడంతో ఒక అటవీ కార్మికుడు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో నలుగురు గాయపడ్డారని అటవీ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈఏడాది జూన్ నెల చివరి నుండి టర్కీ కార్చిచ్చులను ఎదుర్కొంటోంది. పది మంది సహాయక వాలంటీర్లు, అటవీకార్మికులు సహా మొత్తం 18మంది మరణించారు.