– ఉపరాష్ట్రపతి ఎన్నికలో తెలంగాణ బిడ్డకు మద్దతివ్వాలి
– బీఆర్ఎస్ ఎవరికి మద్దతిస్తుందో వారి విజ్ఞతకే వదిలేశాం
– ఈ నెల 24న గంగాధరలో ‘జనహిత పాదయాత్ర’
– పాల్గొననున్న ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ : రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
యూరియా కొరతపై ప్రతిపక్షాల విమర్శలకు రవాణ, బీసీ సంక్షేమశాఖ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. కేటీఆర్ మాటతీరు ‘థర్డ్ క్లాస్’గా మారిందని విమర్శించారు. యూరియా సరఫరా కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని, ఈ విషయం పదేండ్లు మంత్రిగా పనిచేసిన కేటీఆర్కు తెలియదా? అని ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమా వేశంలో మంత్రి మాట్లాడారు. ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేసిందని, ఆయన తెలంగాణ బిడ్డ అని చెప్పారు. ఈ విషయంలో బీజేపీతో కలిపి వెళ్తారా, లేదా తెలంగాణ బిడ్డకు మద్దతిస్తారా అనేది బీఆర్ఎస్ నేతల విజ్ఞతకే వదిలేస్తున్నామ న్నారు. ప్రజా పాలనలో అమలు చేస్తున్న పథకాలను చూసి ఓర్వలేకే బీజేపీ, బీఆర్ఎస్ తమ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నా యని ఆరోపించారు. ఎరువుల కొరత సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశం కాదని, రైతులు గమనించాలని కోరారు. ఎరువుల సరఫరా బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, దీనిపై తమ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రాన్ని కలిసిందని స్పష్టం చేశారు. కరీంనగర్ ఎంపీ బండి సంజరు ఈ సమస్యపై చొరవ చూపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం వివక్షతో వ్యవహరిస్తోందని, బీజేపీకి అనుబంధంగా పనిచేస్తోందని ప్రజలు భావిస్తున్నారన్నారు. పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరానికి రెండు టీఎంసీల నీరు తీసుకురాలేకపోయిందని విమర్శించారు. యూనివర్సిటీలను నిర్వీర్యం చేసిందన్నారు. తాము ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు.
కేటీఆర్ది ‘థర్డ్ క్లాస్’ భాష
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES